హీరో విక్రమ్ సినిమా గ్రీన్ సిగ్నల్ లభించింది. తొమ్మిదేళ్లుగా కోర్ట్ కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న `ధృవ నక్షత్రం` సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఒక కండీషన్ పెట్టింది.
విక్రమ్ ధృవ నక్షత్రం మూవీకి గ్రీన్ సిగ్నల్
హీరో విక్రమ్ సినిమాకి మోక్షం కలిగింది. ఆయన హీరోగా నటించిన `ధృవ నక్షత్రం` చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మద్రాస్ హైకోర్ట్ సినిమాని విడుదలకు ఓకే చెప్పింది. దీంతో తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత `ధృవ నక్షత్రం` సినిమా థియేటర్లోకి రాబోతుంది. జూన్ 15లోపు విడుదల చేసుకునేలా వీలు కల్పించింది. కొండాడువోమ్ ఎంటర్టైన్మెంట్ పేరిట బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయాలని, దీని ద్వారానే సినిమాకి సంబంధించిన లావాదేవీలు జరపాలని కోర్ట్ ఆదేశించింది. ఒక స్పెషల్ ఆఫీసర్ సారథ్యంలో సినిమా కలెక్షన్లు, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించాలని కోర్ట్ వెల్లడించింది.
స్పై యాక్షన్ థ్రిల్లర్గా `ధృవ నక్షత్రం`
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటించగా, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని మొదట సూర్యతో చేయాలనుకున్నారు, కానీ ఆగిపోయింది. ఆ తర్వాత 2017లో విక్రమ్ హీరోగా రూపొందించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీని ఆ ఏడాది విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వాయిదా వేశారు. ఆ తర్వాత 2023లో మరోసారి కోర్ట్ వాయిదా వేసింది.
అనేకసార్లు వాయిదా పడ్డ ధృవ నక్షత్రం
శింబు హీరోగా గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రూ.2.40కోట్లు తీసుకున్నారని, ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించింది. ఆ డబ్బు తమకు తిరిగి ఇవ్వలేదని, ఆయన రూపొందించిన `ధృవ నక్షత్రం` సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్మాణ సంస్థ కోర్టుకి తెలిపింది. దీంతో సినిమాని వాయిదా వేశారు. అప్పట్నుంచి విచారణ జరుగుతూనే ఉంది. పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ దొరికింది. మొత్తంగా `ధృవ నక్షత్రం` మూవీ విడుదలకు అన్ని లైన్స్ క్లీయర్ అయినట్టే అని చెప్పొచ్చు. మరి రిలీజ్ డేట్ని ఎప్పుడు ప్రకటిస్తారో, సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.


