కళాతపస్వి కె.విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్టు మే 3న రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్న విశ్వనాథ్
ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ ఒడిలో మరో కలికితురాయి చేరింది. సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన్ను వరించింది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అందించే ఈ అవార్డు, 2016 గాను కె.విశ్వనాథ్ అందుకోనున్నారు. వచ్చే నెల 3న భారత రాష్ట్రపతి ప్రణభ్ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. విశ్వనాథ్ పలు ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించారు.
శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం , శ్రుతిలయలు, సిరిసిరి మువ్వ, సిరివెన్నెల, స్వయం కృషి,స్వాతి కిరణం, స్వర్ణకమలం, ఆపద్భాందవుడు, శుభసంకల్పం, జీవన జ్యోతి వంటి ఉత్తమ చిత్రాలకు కె. విశ్వనాథ్ దర్శకత్వాన్ని వహించారు.
భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా అయిన కళాతపస్విికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటనతో యావత్ భారతీయ సినీ ప్రముఖులంతా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. విశ్వనాథ్ రూపొందించిన శంకరాభరణం జాతీయ పురస్కారాన్ని దక్కించుకోగా, స్వాతిముత్యం చిత్రం ఆస్కార్కు అధికారిక ప్రవేశాన్ని దక్కించుకుంది. సంస్కృతికి పెద్ద పీట వేసే విశ్వనాథ్ చిత్రాల్లో నటించేందుకు అవకాశం రావడాన్ని నటీనటులంతా మహాభాగ్యంగా భావిస్తారు.
దర్శకత్వంతో పాటు పలు చిత్రాల్లో ఉదాత్తమైన పాత్రలను కూడా పోషించిన విశ్వానాథ్ ప్రస్తుతం ఈ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెదపులివర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ 1957లో విడుదలైన తోడికోడలు చిత్రం కోసం సౌండ్ రికార్డింగ్ విభాగం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు వన్నె తెచ్చారు విశ్వనాథ్.
