ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు ఒక దిగ్గజం. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో అలరించి ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1983లో ఎన్టీఆర్ తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నేడు బుధవారం రోజు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకి తరలి వస్తున్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన మనవళ్లు, ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళి అర్పించారు.ఈ ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వీరిద్దరూ తమ తాతగారు ఎన్టీఆర్ స్మృతికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎమోషనల్ గా కనిపించారు.
రాజకీయాల్లో చెరగని ముద్ర
ఎన్టీఆర్ రాజకీయ, సినిమా రంగాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయనకు నివాళులర్పించేందుకు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకి చేరుకుంటున్నారు. దీనితో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా పలుమార్లు తన తాతగారు ఎన్టీఆర్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "ఆయన పేరు మాత్రమే కాదు, ఆత్మ కూడా తెలుగువారిలో ఉంటుంది" అని ఒక సందర్భంలో తెలిపారు. కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, విలువలకు అంకితభావంతో ఉంటారు. నివాళులర్పించిన అనంతరం, వారు మీడియాకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా నేరుగా అక్కడి నుండి వెళ్లిపోయారు. నందమూరి తారక రామారావు 1923 మే 28న నిమ్మకూరులో జన్మించారు.