Asianet News TeluguAsianet News Telugu

పవన్ అందుకే వస్తున్నాడు.. భయం అనే ప్రశ్నే లేదు-జీవి నాయుడు

  • పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల సమావేశంలో జీవీ నాయుడు ప్రసంగం
  • సమావేశాల్లో ఎమోషనల్ గా మాట్లాడుతున్న జీవి
  • బడుగు,బలహీన వర్గాల ఆశలు నెరవేర్చేందుకు పవన్ రాజకీయాల్లోకి వస్తున్నాడు
jeevi naidu emotional speech in dharmavaram janasena sabha

జనసేన పార్టీ తరపున సినీ నటుడు జీవీ నాయుడు కార్యకర్తల సమావేశంలో విరివిగా పాల్గొంటున్నాడు. నెల క్రితం కార్యకర్తల సమావేశంలో కత్తి మహేశ్‌పై మండిపడ్డ జీవి సుధాకర్ నాయుడు.. తాజాగా ధర్మవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రాజకీయాలను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చర్చేనీయాంశమైంది.

 

ప్రస్తుత కలుషిత రాజకీయాలను కడిగిపారేసేందుకు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడు. ధర్మవరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీచోట అంకిత భావం ఉన్న కార్యకర్తలు జనసేనకు ఉన్నారు. నగదు రహిత రాజకీయాలకు వారంతా సిద్ధంగా ఉండాలి. ఎవడైనా ఓటుకు డబ్బు ఇస్తామంటే చెప్పుతో కొట్టాలన్నారు. వచ్చే 20 ఏళ్లు మాదే రాజకీయం అంటున్న పార్టీపై జీవీ నాయుడు నిప్పులు చెరిగాడు. రాజకీయం వారి సొత్తా అని ప్రశ్నించాడు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని యువకులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకునే విధంగా జనసేన పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. మీలో ఒక యువకుడు, యువతి ఎమ్మెల్యే కావాలి అని ఆయన పిలుపు నిచ్చాడు.

 

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికార పార్టీ మోసం చేస్తోందన్నారు. రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడం లేదు. అధికార పార్టీ అన్ని రకాలుగా విఫలమైంది. రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు పవన్ కల్యాణ్ సంసిద్ధమవుతున్నాడు. ప్రజారాజ్యం చేసినట్లు తప్పులు పునరావృతం కాకుండా పవన్ కల్యాణ్ సరికొత్త రాజకీయాలకు భాష్యం చెప్పబోతున్నాడు అని జీవీ పేర్కొన్నాడు.

 

రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడానికి జనసేన సైనికులు గ్రామ గ్రామానికి వెళ్తున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు. ప్రతీ ఓటరకు ఓటు విలువను వివరిస్తారు. గాంధీ కలలుకన్న రాజ్యం వైపు పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నాడు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోంది. అలాంటి వారికి అండగా నిలువడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. అన్ని సమస్యలకు ఓటు సమాధానం కావాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు.

 

ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా కలిపినందుకు ఏకంగా పవన్ కల్యాణ్ వ్యతిరేకించారు. రాజకీయాల్లో చిరంజీవికి జరిగిన అన్యాయానికి మనకే కడుపు మండిపోతుంటే.. పవన్ కల్యాణ్‌కు ఎంత మండుతుందో చెప్పండి అని జీవీ ఊగిపోయారు. కాపులు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గన్‌మెన్లను పెట్టుకొని తిరుగుతున్నారంటే వారికి మనమంటే ఎంత భయం ఉందో చూసుకొండి. కాపులు ఎలాంటి వారో రాజకీయ నాయకులు పక్కాగా తెలుసు. అందుకే మనకు భయపడుతున్నారు. నేను తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన స్వచ్ఛమైన కాపుని. కాపుల ప్రయోజనాల కోసం చచ్చేదాక పోరాడుతాను అని జీవి అన్నారు.

 

లెక్క చేయం పవన్ కల్యాణ్ విషయంలో ఎవరికీ భయపడేది లేదు. ఎవరినీ లెక్కచేసేది లేదు. జనసేన కోసం ఎంతకైనా తెగిస్తాను. మనం ఏదనుకుంటే అదే చేయాలి అని జీవీ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios