హరి హర వీర మల్లు సినిమా కోసం టికెట్ ధరలు పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం నిర్మాత ఏఎం రత్నం ఫిల్మ్ ఛాంబర్ లో అప్లై చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరి హర వీర మల్లు జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
టికెట్ ధరలు, స్పెషల్ షోల కోసం అప్లై చేసిన ఏఎం రత్నం
మరో 10 రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు పెంచేందుకు, ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతూ అప్లై చేశారు.
థియేటర్ల వివాదం వల్లే ఇలా..
ఇటీవల థియేటర్ల వివాదం టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు ప్రకటించడం వివాదంగా మారింది. ఈ నిర్ణయం వెనుక టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఉన్నారని.. ఇది హరిహర వీరమల్లు చిత్రానికి వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిని కుట్రగానే భావించి టాలీవుడ్ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు వార్నింగ్ తరహాలో ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇకపై నిర్మాతలు టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం వ్యక్తిగతంగా తనని కలవొద్దని.. ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేసుకోవాలని సూచించారు. తన సినిమాలకు కూడా అదే వర్తిస్తుంది అని తెలిపారు.
హరిహర వీరమల్లు టికెట్ ధరలపై ఉత్కంఠ
దీనితో పవన్ కళ్యాణ్ సూచన మేరకే ఫిలిం ఛాంబర్ ద్వారా ఏఎం రత్నం హరిహర వీరమల్లు టికెట్ ధరలు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్లై చేశారు. ప్రస్తుతం ఈ విజ్ఞప్తి ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లిన నేపథ్యంలో, అనుమతి లభిస్తుందా లేదా అన్నది సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. తన సినిమాకు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం.. పైగా ఆయన చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి. కాబట్టి చిత్ర పరిశ్రమకి చెందిన నిర్ణయాలు ఆయన ద్వారానే జరుగుతాయి అనేది వాస్తవం.
చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్, నాజర్, నోరా ఫతేహి, నర్గిస్ ఫఖ్రి, వెన్నెల కిశోర్, పూజిత పొన్నాడ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మితమవుతోంది.
ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలపై ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే ఈ చిత్రం ఓపెనింగ్స్ లో రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.