ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఘాజీ మూవీ రానా దగ్గుబాటి, పివిపి కాంబినేషన్ లో చిత్రం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం
‘ఘాజీ’ ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా మీద నిర్మాతలు కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. ఇండియన్ ఆడియన్స్ కు ‘ఘాజీ’ సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఐతే ఇంత భారీ చిత్రంగా మారిన ‘ఘాజీ’ని ముందు దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఒక లఘుచిత్రంగా తీయాలనుకున్నాడు. ఐతే షార్ట్ ఫిల్మ్ కోసమని వేసిన సెట్టింగ్ చూసి రానా.. పీవీపీ లు ఇంప్రెస్ కావడంతో ఇది సినిమాగా మారింది. వీళ్ల రాకతో సినిమా రేంజే మారిపోయిందని అంటున్నాడు దర్శకుడు సంకల్ప్. సినిమా ఏ రేంజ్ లో తీశారో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
అండర్ వాటర్ మూవీ కావటంతో సీజీ అధికంగా అవసరమవుతుంది కాబట్టి ‘ఘాజీ’ కోసం తొలుత కేవలం 40 కంప్యూటర్ గ్రాఫిక్ షాట్లు అనుకున్నా అది కాస్తా 700కు పెరిగిందట. తొలుత నీటి లోపల వచ్చే సన్నివేశాల కోసం 30 షాట్లు.. వెలుపలి సన్నివేశాలకు 10 షాట్లు ప్లాన్ చేసుకున్నారట. కానీ పీవీపీ అండ్ కో సినిమాను టేకప్ చేయడంతో 40 సీజీ షాట్లు కాస్తా 700 షాట్లయ్యాయట. దీంతో సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయిందని.. ఖర్చు విషయంలో అసలేమాత్రం రాజీ పడకపోవడంతో సినిమా హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయిందని సంకల్ప్ బృందం చెబుతోంది.

ప్రస్తుతం ఇండియాలో ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో సీజీ షాట్లు చేసింది ‘ఘాజీ’ చిత్రానికేనని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద పూర్తి అండర్ వాటర్ అనుభవాన్ని భారతీయ ప్రేక్షకులెవ్వరూ చూసి ఉండరు. మేం సినిమా మొదలుపెట్టడానికి ముందు రెండేళ్ల పాటు ‘ఘాజీ’ని ఎలా తీర్చిదిద్దాలి.. గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ ఎలా తీయాలి అని అధ్యయనం చేశాం. అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా సీజీ.. వీఎఫ్ఎక్స్ తీర్చిదిద్దాం’’ అని ‘ఘాజీ’ వీఎఫ్ఎక్స్ పర్యవేక్షకుడు వాసుదేవ్ తెలిపాడు. మొత్తానికి నాలుగురోజుల్లో రానున్న ఘాజీపై అంచనాలు మాత్రం భారీగా పెరిగాయి.
