థియేటర్ల బంద్ నిర్ణయంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎగ్జిబిటర్ సత్యనారాయణ దీనిపై స్పందించారు. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఆయన కామెంట్ చేశారు.
థియేటర్ల బంద్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గానే ఉన్నారు. థియేటర్ల మెయింటనెన్స్ విషయంలో రాజీపడేది లేదని, ఆడియెన్స్ కి థియేటర్లలో ఫుడ్ కాస్ట్ అందుబాటులో ఉండాలని, టాయిలెట్లు నీట్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. సదరు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి కూడా సూచనలు చేశారు.
జనసేన ఎగ్జిబిటర్ పై దిల్ రాజు ఆరోపణలు
అదే సమయంలో థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. ఈ విషయంపై విచారణకు కూడా ఆదేశించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు షాకింగ్ విషయాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ బంద్ వ్యవహారం ప్రారంభమైందని, జనసేనాకి చెందిన సత్యనారాయణ అనే ఎగ్జిబిటర్లు ఈ నినాదం తీసుకొచ్చారని దిల్ రాజు ఆరోపించారు.
దిల్ రాజు ఆరోపణలపై ఎగ్జిబిటర్ సత్యనారాయణ రియాక్షన్
సత్యనారాయణ జనసేన లీడర్. తూర్పు గోదావరి జిల్లాలో మంచి స్థాయిలో ఉన్నారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తాను తప్పు చేయలేదని నిరూపించుకునేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎగ్జిబిటర్ సత్యనారాయణ స్పందించారు. దిల్ రాజు కావాలనే తనపై నిందలు వేశారని తెలిపారు. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలన్నారు.
జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ కి పిలుపునిచ్చింది దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అని, తమ్ముడిని సేవ్ చేసేందుకు తనపై ఆరోపణలు చేశారని మండి పడ్డారు. ఏప్రిల్ 19న తూర్పుగోదావరిలో ఈ నిర్ణయం తీసుకున్నారని, తనకు ఏం తెలియదని నంగనాచిలా దిల్ రాజు వ్యవహరించారని, మూడు సెక్టార్ల మీటింగ్లో పదే పదే థియేటర్ల బంద్ ప్రస్తావన తెచ్చింది శిరీష్ రెడ్డినే అని అన్నారు సత్యనారాయణ.
థియేటర్ల బంద్కి సంబంధించిన చర్చ 21 మే 2024లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో జరిగిందన్నారు. ఇందులో శిరీష్ రెడ్డి, సురేష్బాబు, సునీల్ నారంగ్ , ఇతర ఎగ్జిబిటర్లు కలిసి తీసుకున్న నిర్ణయమని, థియేటర్ల మూతబడకుండా ఉండేందుకు తమలో తాము తీసుకున్న నిర్ణయమని వాళ్లు ఆ సమయంలో చెప్పినట్టుగా వెల్లడించారు సత్యానారాయణ.
పవన్ కళ్యాణ్ నా దేవు, ఆయన సినిమాని ఎందుకు ఆపుతాను..
పవన్ కళ్యాణ్ నా దేవుడు అని, ఆయన సినిమాని నేనెందుకు ఆపుతాను, ఏప్రిల్ 24న థియేటర్ల బంద్ నిర్ణయాన్ని మేం తీసుకుంటే, మే 16న `హరిహర వీరమల్లు` సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారని తెలిపారు. పవన్ సినిమాకి వ్యతిరేకంగా తాము నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్కి విధేయుడినే అని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇలా థియేటర్ల మూసివేత కుట్రకి సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. మరి ఇది మున్ముందు ఎటు వైపు వెళ్తుందో చూడాలి. కానీ పవన్ ఈ విషయంపై సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది.
`థియేటర్ల బంద్`పై పవన్ సీరియస్తో అంతా సెట్
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనే వార్తలు ఆ చిత్ర బృందాన్ని కలవరానికి గురి చేశాయి. మే ఎండింగ్లో విడుదలయ్యే సినిమాలు, జూన్ లో విడుదలయ్యే సినిమాల మేకర్స్ కూడా ఆందోళన చెందారు.
ఈ క్రమంలో పవన్ రియాక్షన్తో ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.