పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’ నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ చిత్రంలోని తాజా పాటను మేకర్స్ అధికారికంగా విడుదల చేస్తూ ప్రమోషన్స్ను జోరుగా కొనసాగిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా నుంచి ఇప్పటికే మాట వినాలి నరుడ, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’ పాటలు రిలీజ్ అయ్యి.. శ్రోతల నుంచి మంచి స్పందన పొందాయి. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మరో పాట సందడి చేస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ‘తార తార నా కళ్ళు.. వెన్నెల పూత నా ఒళ్లు’ అనే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది.
ఈ పాటకు శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా, లిప్సిక , ఆదిత్య అయ్యంగార్ కలిసి ఆలపించారు. ఈ సాంగ్లో హీరోయిన్ నిధి అగర్వాల్ తన అద్భుతమైన డాన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న హరిహరవీరమల్లు సినిమా మొదటి భాగం... హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో 2025 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్ విర్క్, జిషు సేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ. దయాకర్ రావు హరిహరవీరమల్లు సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో కొంత భాగం క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయగా.. మిగిలిన భాగం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, తాజాగా రిలీజ్ అయిన సాంగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. ఈసినిమాను థియేటర్లలో చూసేందుకు పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఓజీ మూవీ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.