`ఓజీ` టీమ్‌కి మరో షాక్‌.  నటుడు ఇమ్రాన్ హాష్మీకి డెంగ్యూ జ్వరం వచ్చింది., దీనివల్ల 'ఓజీ' సినిమా షూటింగ్ ఆగిపోయింది.  

`ఓజీ` నటుడు ఇమ్రాన్ హాష్మీకి డెంగ్యూ జ్వరం వచ్చింది. ముంబైలోని గోరేగావ్‌లోని ఆరే కాలనీలో 'ఓజీ' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా డెంగ్యూగా నిర్ధారణ అయ్యింది. దీంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఇమ్రాన్ కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ వార్త విన్న అభిమానులు ఆందోళన చెందుతూ, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఇమ్రాన్ హాష్మీ 'ఓజీ' టీమ్‌కి రిక్వెస్ట్ 

ఇమ్రాన్ హాష్మీ కొన్ని రోజులు  విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.  తన ఆరోగ్యం గురించి వెంటనే చిత్ర బృందానికి తెలియజేసి, షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నందుకు చింతిస్తున్నట్టు వెల్లడించారు ఇమ్రాన్‌ హష్మీ. చిత్ర బృందం ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇమ్రాన్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం రోజుల్లో తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ`కి  ఊహించని అడ్డంకి

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న `ఓజీ` మూవీ చాలా సార్లు వాయిదాల అనంతరం ఇటీవలే షూటింగ్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఇప్పుడు ముంబయిలో చిత్రీకరణ జరుగుతుంది. ఇందులోనూ పవన్‌ పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ ఈ మూవీకి అనేక రోజుల తర్వాత డేట్స్ అడ్జెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఇమ్రాన్‌ హష్మీ రూపంలో  మరో అడ్డంకి ఏర్పడినట్టయ్యింది. 

అయితే పవన్‌ కళ్యాణ్‌, ఇమ్రాన్‌ హష్మీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ఇప్పుడు ఇమ్రాన్‌ అనారోగ్యానికి గురికావడంతో చిత్ర బృందం అయోమయంలో పడింది. అయితే పవన్‌ పై సీన్లు చిత్రీకరించాలని భావిస్తున్నారట. ఏదేమైనా వరుసగా వాయిదాల అనంతరం ఈ మూవీని త్వరగా పూర్తి చేయాలనుకున్న టీమ్‌కి ఇప్పుడు ఈ రూపంలో మరో అడ్డంకి ఎదురయ్యిందని చెప్పొచ్చు. 

సెప్టెంబర్ 25న `ఓజీ` విడుదల

ఇమ్రాన్ హాష్మీ నటిస్తున్న తొలి తెలుగు సినిమా 'ఓజీ'. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా, ఇమ్రాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు.  ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు సుజీత్‌.  

త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి సెప్టెంబర్ 25, 2025న సినిమాని విడుదల చేయాలని భావించారు. ఇమ్రాన్ చివరిగా 'గ్రౌండ్ జీరో' సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన 'ఓజీ'తో పాటు, 'అవారాపన్' సీక్వెల్ 'అవారాపన్ 2'లో నటిస్తూ బిజీగా ఉన్నారు.