మెగా వివాదంలో చిక్కుకున్న యంగ్ డైరెక్టర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు. మెగా ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ కు గురైన దర్శకుడు ఎవరు? అసలు వారి కోపానికి కారణం ఏంటి? డైరెక్టర్ ఇచ్చిన వివరణ ఏంటి? 

టాలీవుడ్ యంగ్ హీరోలైన మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కాంబోలో రూపొందిన తాజా సినిమా “భైరవం” ప్రస్తుతం వివాదాస్పద పరిణామాల్లో చిక్కుకుంది. నాంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం మెగా అభిమానులు బాయ్‌కాట్ బైరవం తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈహ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో దూసుకెళుతోంది.

ఈ సినిమాకు ఈ పరిస్థితి రావడానికి కారణం గతంలో ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మార్ఫ్ చేసిన ట్రోల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడమేనని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ ట్రోల్స్ బేస్ చేసుకుని, వాటిని బయటకు తీయ్యడంతో పాటు ఇప్పుడు భైరవం సినిమాపై నెగెటివ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. మెగా ఫ్యాన్స్.

ఇక పరిస్థితులు చేదాటిపోవడం, సినిమాపై నెగెటీవ్ ఎఫెక్ట్ పడుతుండటంతో దర్శకుడు విజయ్ కనకమేడల స్పందించారు. మెగా ఫ్యాన్స్ కు సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే? "ఇన్నిరోజులు నన్ను ఆదరిస్తున్న మెగా అభిమానులు ఒక్కసారిగా వ్యతిరేకంగా మారడం నాకు షాక్ ఇచ్చింది. నేను అలాంటి ట్రోల్స్ ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. బహుశా నా అకౌంట్ హాక్ అయి ఉండొచ్చు. ఇది నా పని కాదు," అని స్పష్టంగా తెలిపారు.

తన సినీ ప్రయాణంలో మెగా కుటుంబంతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, "నేను పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారితో పని చేశాను. వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నేను కూడా మీలో ఒకడినే," అంటూ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

“భైరవం” సినిమాకు సంబంధించి ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీతాజాగా మొదలైన ఈ వివాదం సినిమా ప్రమోషన్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మేకర్స్ ఇంకా దీనిపై స్పందించలేదు. టాలీవుడ్ వర్గాల్లో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మరి మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.