అజిత్‌ హీరోగా నటించిన `గుడ్‌ బ్యాడ్ అగ్లీ` సినిమా వివాదంలో ఇరుక్కుంది.  తన సినిమా పాటల్ని కాపీరైట్ ఉల్లంఘించి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో వాడారని ధనుష్‌ ఫాదర్‌ కస్తూరి రాజా ఆరోపించారు.

 అజిత్ కుమార్ హీరోగా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా నిర్మాతలపై ప్రముఖ దర్శకుడు, హీరో ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా కేసు వేయనున్నారు. తన సినిమాలోని క్లాసిక్ సాంగ్స్ ని కాపీరైట్ ఉల్లంఘించి ఎలాంటి అనుమతిలేకుండా `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ`  సినిమాలో వాడారని ఆయన ఆరోపించారు.  

బాక్సాఫీస్ వద్ద హిట్‌ గా నిలిచిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' యాక్షన్ కథతోపాటు ఓల్డ్ సాంగ్స్ వాడకం వల్ల కూడా మంచి ఆదరణ పొందింది. థియేటర్లలో ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేశారు. థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలో కూడా రిలీజ్‌ అయ్యింది. ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. 

ఇటీవల సేలంలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న కస్తూరి రాజా మాట్లాడుతూ,  కొంతమంది యువ దర్శకుల్లో కనిపిస్తున్న ఓ కొత్త ట్రెండ్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్లకు క్రెడిట్ ఇవ్వకుండా, పారితోషికం చెల్లించకుండా పాత పాటల్ని వాడుతున్నారని ఆయన ఆరోపించారు.

“ఇళయరాజా, దేవా వంటి లెజెండ్స్ కాలాతీతమైన(ఎవర్‌ గ్రీన్‌) సంగీతాన్ని సృష్టించారు. కానీ ఈ రోజుల్లో మేకర్స్ పాతవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. నోస్టాల్జియా(వింటేజ్‌ ఫీల్‌) కోసం క్లాసిక్ పాటలు వాడటంలో తప్పులేదు, కానీ ముందుగా అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఈ రోజుల్లో మనం ఈ ప్రాథమిక మర్యాద కూడా పాటించడం లేదు” అని కస్తూరి రాజా అన్నారు.

ఏప్రిల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నిర్మాతలకు “ఇళమై ఇదో ఇదో”, 'ఎన్ జోడి మంజ కురువి', 'ఒత్త రూప' వంటి క్లాసిక్ పాటల్ని అనుమతి లేకుండా వాడినందుకు నోటీసులు పంపారు. ఈ పాటల్ని సరైన అనుమతి లేకుండా రీమిక్స్ చేసి కమర్షియల్‌గా ఉపయోగించారని నోటీసులో పేర్కొన్నారు. 5 కోట్ల నష్టపరిహారం ఇళయరాజా డిమాండ్ చేశారు.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఆరోపణల్ని ఖండించారు. అన్ని రూల్స్ పాటించే పాటల్ని వాడామని వారు చెప్పారు. “మ్యూజిక్ లేబుల్స్ నుంచి అవసరమైన NOC సర్టిఫికెట్లు, హక్కులు మాకు ఉన్నాయి. మేము నియమాల ప్రకారమే పనిచేశాం” అని మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే నిర్మాతల వాదన తప్పని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కస్తూరి రాజా అన్నారు. ఈ విషయంలో ఇళయరాజాకి తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని కూడా చెప్పారు. బిజినెస్‌ని పక్కన పెట్టి ఒరిజినల్ సృష్టికర్తలను గౌరవించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.