రాజేంద్రప్రసాద్‌ ఐదు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేల కోట్లు సంపాదించాడట. మరి అన్నీ కోల్పోయి జీరో ఎందుకు అయ్యాడో వెల్లడించారు నటకిరీటి.

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ దాదాపు ఐదు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు. ఓ వైపు హీరోగా, మరోవైపు కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. ముఖ్యంగా కామెడీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నారు.

 పాత్ర ఏదైనా నవ్వులు పూయించడం ఆయన ప్రత్యేకత. అదే సమయంలో యాక్షన్‌ మూవీస్ కూడా చేసి మెప్పించారు. సెంటిమెంట్‌, ఎమోషనల్‌ రోల్స్ లోనూ నటించి అలరించారు. నవ్వించమే కాదు కన్నీళ్లు కూడా పెట్టించారు.

`షష్టిపూర్తి` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్న రాజేంద్రప్రసాద్‌

 తాజాగా రాజేంద్రప్రసాద్‌ `షష్టిపూర్తి` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. పవన్‌ ప్రభ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని రూపేష్‌ హీరోగా నటిస్తూ నిర్మించారు. 

రాజేంద్రప్రసాద్‌కి జోడీగా అర్చన నటించగా, రూపేష్‌కి జోడీగా ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇళయరాజా సంగీతం అందించడం, ఎంఎం కీరవాణి ఓ పాట రాయడం, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడం ఈ మూవీ ప్రత్యేకత.

మద్రాస్‌లో వెయ్యి కోట్లు, హైదరాబాద్‌లో రెండు వేల కోట్లు 

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజేంద్రప్రసాద్‌ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో తాను సంపాదించిన ఆస్తుల గురించి వెల్లడించారు.  

జాబ్‌ సాటిస్ఫాక్షన్‌, జేబు సాటిస్ఫాక్షన్‌ అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను సంపాదించినది సరిగ్గా కాపాడుకుంటే మద్రాస్‌(చెన్నై)లో వెయ్యి కోట్లు, హైదరాబాద్‌లో రెండు వేల కోట్ల ఆస్తులు కూడేసేవాడిని అని తెలిపారు.

వేల కోట్లు కోల్పోయి జీరో.. అమితాబ్‌ బచ్చన్‌ లాగానే 

అప్పట్లో ఏడాది 12 సినిమాలు చేశాను, బాగానే పారితోషికం అందుకున్నారు. అవన్నీ ఇప్పుడు వందల, వేల కోట్లతో సమానం, కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయానని తెలిపారు రాజేంద్రప్రసాద్‌. ఇంట్లో వాళ్లే ఏదో చేశారని, కొన్ని టెక్నికల్‌ సమస్యలు వచ్చాయని, మిస్‌ మ్యానేజ్‌ అయి అంతా పోయిందన్నారు నటకిరీటి. 

జీవితంలో కెరీర్‌ పీక్‌ చూసి జీరోకి పడిపోయిన వారిలో అమితాబ్‌ బచ్చన్‌ ఒకరు, ఆ తర్వాత తాను ఉంటానని తెలిపారు. చాలా మంది సన్నిహితులు కూడా నా గురించి ఇదే అంటుంటారని వెల్లడించారు. అయితే తాను ఎప్పుడూ జేబు సాటిస్ఫాక్షన్‌ చూసుకోలేదని, కేవలం జాబ్‌ సాటిస్ఫాక్షన్‌ మాత్రమే చూసుకున్నానని,  

అందుకే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని, ఇప్పటికీ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు, దర్శకులు నా కోసం కథలు, పాత్రలు రాస్తున్నారని తెలిపారు. ఈ టైమ్‌లో కూడా తాను 11 సినిమాలు చేస్తున్నట్టు చెప్పారు రాజేంద్రప్రసాద్‌.

హీరో వెళ్లి డైరెక్టర్‌ పని చేయోద్దు

రాజేంద్రప్రసాద్‌ కూడా నిర్మాతగా మారిన విషయం చెప్పారు. దానివల్ల నష్టపోయిన విషయాన్ని వెల్లడించిన రాజేంద్రప్రసాద్‌ ఇప్పుడు సినిమా నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదని, అయితే ఇప్పుడున్నంత డిస్టర్బెన్స్ కూడా అప్పట్లో లేదన్నారు. ఈ సందర్భంగా ఓ సినిమా షూటింగ్‌ సంఘటనని పంచుకున్నారు. 

`నేను ఇప్పటికీ షాట్ చేసిన తరువాత మానిటర్ చూడను. నాకు ఆ అలవాటు కూడా లేదు. కానీ ఆ మధ్య ఓ సినిమాకి సంబంధించిన పెద్ద హీరో మానిటర్‌ చూసి పదకొండు టేకులు చేస్తే ఫస్ట్ టేక్‌ ఓకే చేశాడని, మానిటర్ చూసుకుని వన్స్ మోర్ అని చెప్పాల్సింది దర్శకుడు, మనం(ఆర్టిస్ట్) కాదని, మన పని మనం చేసుకోవాలి` అని తెలిపారు రాజేంద్రప్రసాద్.

`షష్టిపూర్తి` సినిమా నవ్విస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది

`షష్టిపూర్తి` చిత్రం గురించి చెబుతూ, ఇళయరాజా మాతో పోటీ పడి మరీ సంగీతాన్ని అందించారు. కీరవాణి మా కోసం పాట రాశారు. కీరవాణి పాట రాస్తున్నారా? అని రాజా కూడా షాక్ అయ్యారు. మా ‘షష్టిపూర్తి’ కోసం రాజా అద్భుతమైన పాటల్ని అందించారు. చైతన్య ప్రసాద్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. 

`షష్టిపూర్తి` చిత్రంలో మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయి. ‘లేడీస్ టైలర్’ మూవీ మాడ్యులేషన్, గెటప్ కావాలని దర్శకుడు పట్టుబట్టుకుని కూర్చున్నారు. కానీ నా యాటిట్యూడ్ వల్ల ఆ పాత్రను ఈజీగా పోషించాను. ఇందులో మూడు ఏజ్‌ గ్యాప్‌లను చూపించాం. ఇది నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. 

ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. నవ్విస్తాను, ఏడ్పిస్తాను. ఈ మూవీని చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారు` అని తెలిపారు రాజేంద్రప్రసాద్‌.