అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి రావట్లేదు.. కారణం అదే
- పవన్ కల్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న క్రేజీ మూవీ అజ్ఞాతవాసి
- డిసెంబర్ 19న హైదరాబాద్ హైటెక్స్ లో ఈమూవీ ఆడియో వేడుక
- అజ్ఞాత వాసి ఆడియో వేడుకకు చిరంజీవి రావట్లేదన్న యూనిట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వస్తోన్న మూవీ అజ్ఞాతవాసి. ప్రస్థుతం రాజకీయాలతో బిజీబిజీగా వున్నా.. పవన్ కల్యాణ్ తాజాగా అజ్ఞాతవాసి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 19న హైదరాబాద్లో జరుగనుంది.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విధాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ ఈవెంట్ నిర్వాహకులను హెచ్చరించినట్టు సమాచారం. గతంలో కొన్ని ఆడియో ఈవెంట్స్ సందర్భంగా చోటుచేసుకొన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అవసరమున్న మేరకు మాత్రమే పిలువాలని పవన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతోపాటు,తన అభిమానులను మాత్రమే పిలువాలని పవన్ సూచించారట. దీంతో వేడుక ప్రాంగణంలో పట్టేంతమందికే ఆహ్వానాలను పంపాలని, ప్రత్యేకమైన ఇన్విటేషన్ కార్డులను ముద్రించనున్నారట. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరక్కుండా చూసుకోవాలని పవన్ సూచించారట.
ఇక అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ ఫంక్షన్కు చిరంజీవి రావడం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలు, ముందస్తు అపాయింట్మెంట్ లు వున్న కారణంగానే చిరంజీవి ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్టు సమాచారం. ఇక చిరంజీవి స్థానంలో ముఖ్య అతిథిగా వెంకటేష్ వస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.