ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు వెలుగులు సినీ పరిశ్రమ తరలిరావటంతో సినీ హంగులద్దుకున్న మహాసభలు చిరంజీవి, రాజమౌళి సహా పలువురు తారలు హాజరు ఈ సందర్భంగా చిరంజీవి, మోహన్ బాబుల కౌగిలి ఆకర్షణ

తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు నాలుగో రోజైన సోమవారం (డిసెంబర్ 18) కూడా ఉత్సాహంగా సాగుతున్నాయి. సాంసృతిక సమావేశానికి తెలుగు సినీ గ్లామర్ కొత్త శోభ తీసుకొచ్చింది. ఎల్‌బీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రాకతో సందడి నెలకొంది.

చిరంజీవితో పాటు సినీ దిగ్గజాలు నందమూరి బాలకృష్ణ, మోహన్‌బాబు, కే రాఘవేంద్ర రావు, వెంకటేష్, రాజమౌళి, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, గిరిబాబు, అశ్వనీదత్, సుమన్, జయసుధ, జగపతిబాబు, తమ్మారెడ్డి భరద్వాజ, విజయ్ దేవరకొండ, పోసాని కృష్ణ మురళి, ఎన్ శంకర్, హరీష్ శంకర్, ఆర్ నారాయణ మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు. యాంకర్ ఉదయభాను తనదైన వ్యాఖ్యానంతో కార్యక్రమానికి జోష్ తీసుకొచ్చారు. సభా వేదికపై చిరంజీవి, మొహన్ బాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు.