వేధింపులకు పాల్పడ్డాడని గత జనవరిలో వ్యాపారవేత్త అమర్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన జీనత్ అమన్ తనను రేప్ చేశాడని, అసభ్యకర మెసేజ్ లు పంపుతున్నాడని తాజాగా ఫిర్యాదు అమర్ ఖాన్ అరెస్టు

అలనాటి బాలీవుడ్‌ నటి జీనత్‌ అమన్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త అమర్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమర్ ఖాన్ తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, గత కొద్ది రోజులుగా తన మొబైల్ కు అసభ్యకర ఫొటోలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని జూహూ పోలీసులకు జీనత్ అమన్ ఫిర్యాదు చేశారు. గత జనవరిలో ఆమె అమర్ ఖాన్ పై ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ ఫిర్యాదులో కేవలం వేధింపులను మాత్రమే ప్రస్తావించారు. అత్యాచారానికి సంబంధించిన వివరాలేవీ అందులో వెల్లడించలేదు.

బాలీవుడ్‌ లో ‘సత్యం శివం సుందరం’, ‘కుర్బానీ’, ‘అజ్‌ నబీ’ వంటి సినిమాలతో జీనత్‌ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. అనంతరం 1985లో మజార్‌ ఖాన్‌ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. వివాహానంతరం ఆమె నటనకు స్వస్థి చెప్పారు. 1998లో మజార్‌ మరణించడంతో ఇద్దరు కుమారులతో కలసి ఆమె ముంబైలోని జూహులో నివసిస్తున్నారు.

జీనత్ కుటుంబానికి అమర్‌ ఖాన్‌ కుటుంబంతో మంచి స్నేహం ఉంది. ఆర్థిక సంబంధమైన మనస్పర్థలతో ఈ రెండు కుటుంబాలు దూరమయ్యాయి. కొంత కాలంగా అమర్‌ సయోధ్యకు ప్రయత్నిస్తూ, ఆమెను ఇంటికి ఆహ్వానించడంతో స్పందించి వెళ్లారు. ఆమె అతని ఇంటికి వెళ్లిన తరువాత నిజస్వరూపం ప్రదర్శించాడని ఆమె గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.