మగధీరను మక్కికి మక్కీ దింపి రాబ్తా అంటున్నారని కోర్టుకెక్కిన అల్లు అరవింద్
- జూన్ 9న రాబ్తా విడుదలకు ప్లాన్ చేసిన నిర్మాతలు
- సుషాంత్ సింగ్ రాజ్ పుత్, కృతీ సనన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రాబ్తా
- రాబ్తా అంతా మగధీర కాపీ అని కోర్టుకెక్కిన నిర్మాత అల్లు అరవింద్
- జూన్ 1కి విచారణ వాయిదా వేసిన కోర్టు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్, కృతి సనన్ ( మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ ఫేమ్) జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘రాబ్తా’. ఈ చిత్రం ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ రిలీజవ్వగానే ‘‘తెలుగులో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘మగధీర’ చిత్రానికి, దీనికి చాలా కనెక్షన్ ఉన్నట్టుంది!’’ అని సోషల్ మీడియాలో సినీగోయెర్స్ బాగానే సెటైర్స్ వేశారు. ‘రాబ్తా’ ట్రైలర్లో, స్టిల్స్లో ‘మగధీర’ ఛాయలు కనిపిస్తున్నాయని అంతా అనుకుంటున్నారు.
అయితే రాబ్తా సినిమాకు మగధధీరతో కనెక్షనే కాదు మొత్తం సినిమానే మక్కికి మక్కి కాపీ చేసి కథను హైజాక్ చేశారని మగధీర నిర్మాత అంటున్నారు. ‘‘రాబ్తా అంటే కనెక్షన్. కానీ మగదీరతో కనెక్షన్ పెట్టుకున్నారని అనుకున్నాం కానీ ఏకంగా మా చిత్రకథను కాపీ కొట్టారు’’ అంటూ ‘మగధీర’ చిత్రనిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు మెట్లెక్కారు. ‘రాబ్తా’ విడుదలను నిలిపివేయాలని కోరారు. కేసును కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది. జూన్ 9న ‘రాబ్తా’ విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో 1న ఏం తీర్పు వస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఒకవేళ రాబ్తా చిత్రం మగధీర కథను కాపీ కొట్టిన సినిమా అయితే భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి. కోర్టు అన్ని విషయాలు పరిశీలించి 9న తలపెట్టిన రాబ్తా చిత్ర విడుదలను నిలిపేస్తుందా.. లేక కథ వేరే అని నిరూపించుకుని రాబ్తా టీమ్ బయటపడుతుందా అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.