బాహుబలితో మిగిలిందేం పెద్దగా లేదు...నిజం: నిర్మాత
- బాహుబలి సినిమా నిర్మాతలకు ఇప్పటిదాకా మిగిలిందేం లేదట
- రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన బాహుబలి
- బాహుబలి పార్ట్ 1లో తమకు మిగిలింది అంతంత మాత్రమేనన్న నిర్మాత
- లాభాలు పార్ట్ 2 రిలీజ్ తర్వాత వస్తాయంటున్న నిర్మాత
భారతీయ చలనచిత్ర పరిశ్రమలన్నింటిలోకెల్లా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ మొదటి భాగం 2015లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 2017 లో రెండో భాగం విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలను హైదరాబాద్, ముంబైలలో నిర్వహించారు.
హిందీ వెర్షన్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సినిమా బడ్జెట్ పై, మొదటి భాగం రిలీజ్ తర్వాత వచ్చిన లాభాలపై పలు విషయాలు వెల్లడించారు. బాహుబలి సిరీస్ పూర్తిచేసేందుకు మొత్తం రూ. 450 కోట్లు ఖర్చు చేసినట్లు శోభుయార్లగడ్డ వెల్లడించారు. శోభు చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఇండియాలో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.
ఇక బాహుబలి ఫస్ట్ పార్ట్ అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఇంత వసూళ్లు సాధించినప్పటికీ నిర్మాతలకు పెద్దగా లాభాలేమీ రాలేదని, తమకు రెండో పార్టు ద్వారానే ఏమైనా మిగలాలని శోభుయార్లగడ్డ చెప్తున్నారు. శోభు చెప్పిందాన్ని బట్టి.. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే ఎక్కువ లాభాలు పొందినట్లు స్పష్టమవుతోంది. సినిమాను కొనుగోలు చేసిన వారికి భారీగా లాభాలు వచ్చిన మాట నిజమే. అయితే బాహుబలి సినిమాను చైనా, యూరఫ్ లోని పలు దేశాల్లో రిలీజ్ చేయగా ఆశించిన ఫలితాలు రాలేదు.
అయితే బాహుబలి పార్ట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా జరిగింది. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్ రన్ ద్వారా రూ. 1000 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా. సో ఇప్పటికే 450 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బాహుబలి పార్ట్ 2 రిలీజ్ తర్వాత నిర్మాతలకు కాసుల పంట పండటం ఖాయంగా కనిపిస్తోంది.