పుట్టిన రోజు సందర్భంగా తన అమూల్యమైన మిత్రుడిని సర్ప్రైజ్ చేసిన అనుష్క
- రెబెల్స్టార్ ప్రభాస్ 38వ జన్మ దినం సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా పోటెత్తాయి.
- దేవసేన కూడా ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
- అమూల్యమైన మిత్రుడిని సర్ప్రై
జ్ చేసేందుకు స్పెషల్గా ప్లాన్ చేసి ఒక డిజైనర్ వాచీని గిఫ్ట్ గా పంపింది.
తెలుగు సినీ హీరోల్లో ఇప్పుడు క్రేజీ స్టార్ ఎవరంటే అది బాహుబలి ప్రభాస్. రెబెల్స్టార్ ప్రభాస్ 38వ జన్మ దినం సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా పోటెత్తాయి. చిత్ర రంగ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాహుబలికి దేవసేన కూడా ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
"అద్భుతమైన వ్యక్తులలో ఒకరైన ప్రియ మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పటికీ సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను." అంటూ ప్రభాస్తో ఉన్న ఫోటోస్ను పోస్ట్ చేసింది అనుష్క (స్వీటీ) షెట్టి.
పుట్టిన రోజు సందర్భంగా తన అమూల్యమైన మిత్రుడిని సర్ప్రైజ్ చేసేందుకు స్పెషల్గా ప్లాన్ చేసి ఒక డిజైనర్ వాచీని గిఫ్ట్ గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని ఓ బాలీవుడ్ పత్రిక కథనం. ప్రభాస్కు వాచీలంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్ చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది.
పలు సినిమాల్లో దశాబ్ధ కాలంగా కలిసి నటించిన వీరిద్దరూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజీ జోడీగా పేరుతెచ్చుకున ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ఇంతకుముందు చాలాకాలం వదంతులు వచ్చాయి. వీటిని ప్రభాస్ ఖండించారు. బాహుబలి2 తర్వాత ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ అయిపోయారు.
ప్రభాస్.. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సాహో అనిపించింది. మరోవైపు అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో అనుష్కను అందంగా చూపించేందుకు గ్రాఫిక్స్ కోసం దాదాపు 5కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.