మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా టీ హబ్ లో కాంటినెంటల్ ఫినాలే నిర్వహించారు. ఇందులో శ్రీలంక, ఇండియాకి చెందిన అందగత్తెలు ఎమోషనల్ కామెంట్స్ తో హృదయాలు గెలుచుకున్నారు. 

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా గ్రాండ్ గా ఏర్పాట్లు చేసింది. బుధవారం రోజు మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా టీ హబ్ లో కాంటినెంటల్ ఫినాలే నిర్వహించారు. ఇందులో యూరప్, ఆసియా దేశాలకు చెందిన పలువురు అందగత్తెలు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో పాల్గొని అద్భుతంగా ప్రసంగించారు. 

మిస్ వరల్డ్ పోటీలు అందం కోసం మాత్రమే కాదు   

మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందం కోసం మాత్రమే కాదని.. సమాజంలో మార్పు కోసం ఉపయోగపడాలని పలువురు సుందరీమణులు ఎమోషనల్ గా మాట్లాడారు. ఇండియాకి చెందిన నందిని గుప్తా, శ్రీలంక కి చెందిన అనుది గుణశేఖర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాము చేస్తున్న సామాజిక కృషి గురించి తమ ప్రసంగాల్లో తెలిపారు.

వాటికి ట్యాక్స్ ఉండకూడదు, శ్రీలంక అందగత్తె కామెంట్స్ 

అనుది గుణశేఖర మాట్లాడుతూ.. మా శ్రీలంక దేశం చాలా చిన్నది కావచ్చు. కానీ మా ప్రజల హృదయాలు.. ఆశలు ఏమాత్రం చిన్నవి కావు. స్త్రీలలో పీరియడ్స్ గురించి అవగాహన కోసం మా దేశంతో పాటు, వివిధ ప్రపంచ దేశాలలో కార్యక్రమాలు చేస్తున్నట్లు అనుది తెలిపారు. శానిటరీ ఉత్పత్తులపై ట్యాక్స్ ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దీనికోసం నా వంతు కృషి చేస్తా. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిస్తే ప్రపంచం మొత్తాన్ని మార్చేయలేకపోవచ్చు.. కానీ నా భావాలని బలంగా వినిపిస్తా అని అనుది తెలిపారు.

ఆకట్టుకున్న నందిని గుప్తా 

ఇండియా తరపున మిస్ వరల్డ్ పోటీల్లో రాజస్థాన్ కి చెందిన నందిని గుప్తా పాల్గొంటోంది. తన జీవిత కథని బ్యూటీ విత్ ఏ పర్సన్ విభాగంలో వివరించింది. అదే సమయంలో తాను మానసిక వికలాంగుల కోసం చేస్తున్న కార్యక్రమాలని వివరించింది. మానసిక వికలాంగుల కోసం తాను ప్రాజెక్ట్ ఏక్తా చేపట్టినట్లు తెలిపింది. ఇందులో ఇప్పటికే మూడు వేల మంది భాగస్వాములు అయ్యారని.. దీనిపై ఇంకా మరింత కృషి చేస్తానని నందిని గుప్తా పేర్కొంది. ఇక మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా గురువారం రోజు శిల్పకళా వేదికలో టాలెంట్ చాలెంజ్ ఫైనల్ ఉండబోతోంది. దీనికి మొత్తం 24 మంది కంటెస్టెంట్స్ అర్హత సాధించారు. వారిలో నందిని గుప్తా కూడా ఉండడం విశేషం.