"రామాయణం'లో రాముడు రామ్ చరణ్.. ఫిక్స్ చేసిన అల్లు అరవింద్
- 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న రామాయణం
- భారీ బడ్జెట్ తో రామాయణం చిత్రాన్ని తెరకెక్కిస్తామన్న అల్లు అరవింద్
- రామాయణం చిత్రంలో రామునిగా రామ్ చరణ్ ను పక్కా చేసిన నిర్మాత
రామ్ చరణ్ సినిమా
బాహుబలి సాధించిన అఖండ విజయం నిర్మాతల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకొచ్చిందా.. అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. బాహుబలి సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమా గతంలో మగధీర లాంటి సినిమాను తెరకెక్కించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ త్వరలో.. రామాయణం తెరకెక్కించాలని నిర్ణయించారు.
దర్శక ధీరుడు రాజమౌళి గతంలో తెరకెక్కించిన మగధీర అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, ఇప్పుడు బాహుబలి చిత్రం మరే భారతీయ సినిమా.. అంటే బాలీవుడ్ సినిమా కూడా సాధించనన్ని రికార్డు కలెక్షన్లు సాధించి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ విజయం దేశంలోని సినీ నిర్మాతల దృక్ఫథంలో బలమైన మార్పు తీసుకొచ్చింది. ఆర్కా మీడియా ధైర్యంతో ఆరు వందల కోట్ల వరకు ఈ సినిమాపై ఖర్చు పెట్టినా... తిరిగి రాబట్టడంలో కూడా అంతకు మించి విజయం సాధించారు.
సరైన సినిమా నిర్మించి పక్కా మార్కెటింగ్ వ్యూహాలతో ముందుకెళ్తే భారీ విజయం నమోదు చేయొచ్చని నిరూపించిన బాహుబలి.. ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్ ఎంత ఖర్చైనా పెట్టి అద్భుతమైన రామాయణాన్ని తెరకెక్కించేలా ప్రేరేపించింది. ఈ చిత్రంలో ఇప్పటికే మగధీర సినిమాతో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ సాధించిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామునిగా నటించనున్నాడని సమాచారం.
జంజీర్ లాంటి బాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన అనుభవం కూడా రామ్ చరణ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చింది. అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితేనే రామునిగా సరిపోతాడని నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా కన్ఫమ్ కానప్పటికీ త్వరలోనే అన్ని వివరాలు వెల్లడించనున్నారు. మొత్తానికి రాముని పాత్ర మాత్రం కొడుకు అల్లు అర్జున్ ను కూడా పక్కనబెట్టి రామ్ చరణ్ ను ఎంచుకున్నారు నిర్మాత అరవింద్. ఇక 500 కోట్లతో తెరకెక్కిస్తామని నిర్మాత ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమా పూర్తయితే.. మరో తెలుగు సినిమా రికార్డులు క్రియేట్ చేయడం తధ్యం.
అయితే రామాయణం లాంటి అందరికీ తెలిసిన కథను దర్శకుడు ఎలా డీల్ చేస్తాడన్నది మాత్రం ఖచ్చితంగా పరిగణించాల్సి ఉంటుంది.