అల్లు అర్జున్ కు పంతులు శాపం... నష్ట నివారణకు అరవింద్ చర్యలు
- డీజే దువ్వాడ జగన్నాథం మూవీలో పంతులు పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్
- అల్లు అర్జున్ కు అచ్చిరాని పంతులు పాత్ర
- పవన్ తో వార్ ప్రభావం వల్ల టీజర్ కు నెగెటివ్ రెస్పాన్స్
అల్లు అర్జున్ చిత్రం దువ్వాడ జగన్నాధం చిత్ర టీజర్ ‘డిస్లైక్స్’ వ్యవహారం సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. 'డిస్లైక్స్' వ్యవహారం సోషల్ మీడియాలో వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ మధ్య వివాదానికి తెర దించేందుకు అల్లు కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని తెలుస్తోంది.
గత మంగళవారం నాటికే దువ్వాడ జగన్నాధం టీజర్కు దాదాపు లక్షకు పైగా డిస్లైక్స్ వచ్చాయి. గతంలో ఎన్నడూలేని విధంగా డిస్ లైక్స్ రావడం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పనే అనే భావనలో అల్లు కుటుంబం ఉన్నట్టు తెలుస్తోంది. సరైనోడు ఆడియో వేడుకలో చెప్పను బ్రదర్.. అంటూ పవన్ ఫ్యాన్స్ కోరికను నిరాకరించిన అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం ప్రారంభమైంది. పవన్ కల్యాణ్పై ‘చెప్పను బ్రదర్' అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్కు కోపం తెప్పించాయి.
అల్లు అర్జున్ విషయం పక్కన పడితే ఇటీవల పవన్ కల్యాణ్ను ఉద్దేశించి వీపీ గాడు అంటూ అల్లు శిరీష్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో దుమారం రేపాయి. వ్యాఖ్యల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేందుకు తాజా సంఘటనలు మరింత బలాన్నిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ విన్నర్ ఆడియో రోజున దువ్వాడ జగన్నాధం ఫస్ట్ లుక్, విన్నర్ రిలీజ్ రోజున డీజే టీజర్ విడుదల చేయడంపై పవన్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఇది అల్లుఅర్జున్ ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు వారు ఆరోపిస్తున్నారు.
అప్పటి నుంచి అల్లు అర్జున్, శీరిష్కు వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా అల్లు కుటుంబంపై సోషల్ మీడియాలో నరకం చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణే డీజే టీజర్ ఉదంతం. ఈ టీజర్కు 2 మిలియన్ల లైక్స్ రావడం గమనార్హం. మెగా కాంపౌండ్కు సంబంధించిన టీజర్కు ఇంత ప్రతికూలంగా స్పందన రావడం, పెద్ద ఎత్తున డిస్లైక్స్ రావడం ఇదే తొలిసారి.
దీంతో పవన్ కల్యాణ్తో ఇంకా పెట్టుకొంటే కష్టమనే భావనలో అల్లు కుటుంబం ఉన్నట్టు సమాచారం. అందుకే జరిగిన సంఘటనలకు పవన్కు క్షమాపణలు చెప్పి ఇంతటితో ఈ వివాదానికి తెరవేయాలని అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో డీజేకు సంబంధించిన ఓ పాటను పవర్ స్టార్తో విడుదల చేసి పవన్ కల్యాణ్ అభిమానుల కోపాన్ని తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై మెగా బ్రదర్స్ తో కూడా అరవింద్ చర్చించారని సమాచారం.