టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా వార్తల్లో నిలిచారు. దాదాపు 100 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడు గంటలపాటు అల్లు అరవింద్ ని విచారించారు.
100 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా వార్తల్లో నిలిచారు. దాదాపు 100 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడు గంటలపాటు అల్లు అరవింద్ ని విచారించారు. హైదరాబాద్లోని ఈడీ జోన్ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఈ కేసులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలీట్రానిక్స్ (RTPL) సంస్థలు ప్రధాన అనుమానితులుగా ఉన్నాయి.
ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు హైదరాబాద్, కర్నూలు, ఘాజియాబాద్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బెంగళూరులో రిజిస్టర్ చేసిన FIR ఆధారంగా ఈ కేసు నమోదైంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదు మేరకు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, RTPL సంస్థలు బ్యాంక్ నుంచి పొందిన లోన్లను అక్రమంగా వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థల డైరెక్టర్లు, పార్టనర్లు అయిన వి. రాఘవేంద్ర, వి. రవి కుమార్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ సంస్థలు బ్యాంకుల నుంచి పొందిన రూ.101.4 కోట్ల లోన్ను వేరే పనుల కోసం దారి మళ్లించారని, ఇందులో మోసం, మనీలాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఈడీ విచారణకు అల్లు అరవింద్
ఈ వ్యవహారంలో అల్లు అరవింద్కు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో, ఈడీ అధికారులు ఆయనను విచారణకు హాజరయ్యేలా చేశారని తెలుస్తోంది. విచారణలో ఆయనతో ఈ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా వివరాలు తీసుకున్నట్టు సమాచారం.
అల్లు అరవింద్ వివరణ ఇదే
అయితే ఈడీ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. మీడియాలో చూపిస్తున్నట్లు ఏదో పెద్దగా జరిగిపోలేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2017లో నేను ఓ ప్రాపర్టీ కొన్నాను. అది మైనర్ వాటాదారుడికి చెందిన ప్రాపర్టీ. అతడికి బ్యాంక్ లోకి సంబంధించిన వివాదం ఏదో ఉంది. లోన్ తీసుకుని కట్టలేదని చెబుతున్నారు. దీనితో అతడిని ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అక్కడ అకౌంట్స్ బుక్స్ లో నా పేరు కూడా ఉంది. దీనితో అధికారులు ఎంక్వైరీ కోసం పిలిచారు.
ఈడి అధికారులు పిలిచారు కాబట్టి బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరయ్యా. ఈడీ అధికారులకు వివరణ ఇచ్చాను. అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు అని అల్లు అరవింద్ అన్నారు. అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇది అధికారులు అల్లు అరవింద్ ని మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.