ర్యాష్ డ్రైవింగ్...కాలువలోకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్ నుండి ప్రయాణికులతో అమలాపురానికి బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా: హైదరాబాద్ నుండి ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేట్ బస్సు ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తొ పాటు తెల్లవారుజామున నిద్రమత్తు తోడవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దుర్ఘటన నుండి ప్రయాణికులతో పాటు బస్సు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
నిన్న(ఆదివారం) రాత్రి హైదరాబాద్ నుండి అమలాపురానికి కావేరీ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. సోమవారం తెల్లవారుజాముకు అంబాజీపేట మండలం పెదపూడి వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కాలువవలోకి దూసుకెళ్ళింది.
read more RTC Strike:విషాదం...మహిళా ఆర్టీసి కార్మికురాలి ఆత్మహత్య
ప్రమాద సమయంలో మంచి నిద్రమత్తులో ప్రయాణికులకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారిగా బస్సు కుదుపులకు లోనవడంతో ఆందోళనకు లోనయ్యారు. అయితే బస్సు కాలువలోకి దూసుకెళ్లి ఆగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. దీంతో ప్రయాణికులంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ప్రమాదం గురించి బయటకు పొక్కకూడదనే ఉద్దేశంతో బస్సు సిబ్బంది అతితెలివిని ప్రదర్శించినట్లు ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సు నెంబర్ ప్లేట్స్ మీద మట్టి పూసి నెంబర్ కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
read more ఇద్దరితో లవ్, శవం పక్కన ప్రియుడితో కలిసి..: తల్లిని చంపిన కీర్తి అరెస్టు
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రయాణికులను, బస్సు సిబ్బంది నుండి సమాచారాన్ని సేకరించారు. ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ వాటిల్లక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.