లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. తొలి రెండు రోజుల పాటు బౌలర్ల ఆధిపత్యమే కనిపించిన ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా 282 పరుగుల గెలుపు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. 

మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 138 పరుగులకే కుప్పకూలగా, ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది. 74 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి బ్యాటింగ్ లో తడబడింది. అయితే చివర్లో మిచెల్ స్టార్క్ (58) మరియు జోష్ హేజెల్ వుడ్ (17) అద్భుత భాగస్వామ్యం అందించడంతో, కంగారూలు 207 పరుగులు చేసి గౌరవప్రద స్థితిలో నిలిచారు.

ఈ మేరకు రెండో ఇన్నింగ్స్ 207 పరుగులు + మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 74తో మొత్తం 281 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

లార్డ్స్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో, నాలుగో ఇన్నింగ్స్ లో భారీ లక్ష్యం ఛేదించడం ఇప్పటివరకు చాలా అరుదు. ఈ మైదానంలో ఇప్పటివరకు 250కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన ఘట్టాలు కేవలం మూడే ఉన్నాయి.

1984లో వెస్టిండీస్ – 344 పరుగులు

2004లో ఇంగ్లాండ్ – 282 పరుగులు

2022లో ఇంగ్లాండ్ – 277 పరుగులు

ఈ గణాంకాలు దక్షిణాఫ్రికా ముందున్న సవాళ్ల తీవ్రతను సూచిస్తున్నాయి.

అయితే, ఈ టెస్ట్ ఫైనల్ ఇప్పటికీ ఎవరి వైపూ స్పష్టంగా మొగ్గుచూపకపోవడం గమనార్హం. పిచ్ నాలుగో రోజు నెమ్మదిగా మారుతూ బ్యాటర్లకు కొంతగా అనుకూలంగా మారవచ్చని నిపుణుల అభిప్రాయం. అయినా, ఆస్ట్రేలియా బౌలింగ్ దళం ప‌టిష్టంగా ఉండ‌డంతో విజ‌యం అంత సుల‌భం కాద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి సౌతాఫ్రిక విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.