Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్లో అండర్-19 సిరీస్లో వైభవ్ సూర్యవంశీ మరొకసారి ధాటిగా ఆడాడు. భారత జట్టుకు మంచి ఇన్నింగ్స్ ను అందించాడు.
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ సంచలనం, అతిచిన్న వయస్సులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి చరిత్ర లిఖించిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత అండర్ 19 జట్టులో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025లో తనదైన బ్యాటింగ్ తో ధాటిగా ఆడుతూ రాణించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న అండర్-19 సిరీస్లో మరోసారి మెరిశాడు.
నార్తాంప్టన్లో సోమవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ ర్యూ టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభం అందించాడు.
మరోసారి రెచ్చపోయిన వైభవ్ సూర్యవంశీ
ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో ఉన్న ఈ ఎడమచేతివాటి బ్యాట్స్మెన్ను ఇంగ్లాండ్ పేసర్ జాక్ హోమ్ ఔట్ చేశాడు. 11వ ఓవర్లో డీప్లో క్యాచ్ అవుట్ అయిన వైభవ్కు జాక్ హోమ్ గట్టి సెండ్-ఆఫ్ ఇచ్చాడు. వికెట్ సాధించిన తర్వాత ప్రత్యర్థి ముందు నిలబడి డ్రెస్రూమ్కు వెళ్ళమని జాక్ చేయి ఊపడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తొలి మ్యాచ్ లోనూ మంచి నాక్ ఆడిన వైభవ్ సూర్యవంశీ
ఇదే సిరీస్లో గత మ్యాచ్లోనూ వైభవ్ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 175 పరుగుల లక్ష్యాన్ని భారత్ 24 ఓవర్లలోనే 6 వికెట్లతో సాధించింది. ఈ విజయంలో వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. కేవలం 19 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 48 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఐపీఎల్ లో భారీ బిడ్డింగ్ దిశగా వైభవ్
ఐపీఎల్ 2025 వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ. 1 కోటికి కొనుగోలు చేసింది. తన అరంగేట్రం సీజన్ లోనే అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన యంగ్ ప్లేయర్ గా నిలిచాడు. తొలి సీజన్ లోనే మంచి ప్రదర్శనలు ఇవ్వడం, ప్రస్తుతం అండర్ 19 జట్టుకు మంచి ఇన్నింగ్స్ లను ఆడటంతో తదుపరి ఐపీఎల్ సీజన్ లో అతని కోసం భారీ బిడ్డిండ్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే వైభవ్ పై మరింత పెద్ద మొత్తం ఖర్చు చేసేందుకు ఇతర జట్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్న ఈ యువ క్రికెటర్ను మరిన్ని జట్లు ఆకర్షించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
కాగా, ఈ మ్యాచ్లో వైభవ్తో పాటు విహాన్ మల్హోత్రా 49 పరుగులు, కనిష్క్ చౌహాన్ 45 పరుగులు చేయడంతో భారత అండర్-19 జట్టు మొత్తంగా 290 పరుగులు చేసింది. అయితే 49 ఓవర్లలో టీమ్ ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ పేసర్ ఎఎం ఫ్రెంచ్ నాలుగు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన అందించాడు.

