- Home
- Sports
- Cricket
- Rishabh Pant: సెంచరీలు కొట్టకు సామీ.. రిషబ్ పంత్ ను వేడుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్ !
Rishabh Pant: సెంచరీలు కొట్టకు సామీ.. రిషబ్ పంత్ ను వేడుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్ !
Rishabh Pant: ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీల మోత మోగించాడు. అయితే, నువ్వు సెంచరీలు చేయకు సామీ అని పంత్ ను భారత ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఎందుకో తెలుసా?

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రెండో మ్యాచ్పై దృష్టిపెట్టిన పంత్
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టు మ్యాచుల సిరీస్లో రెండో మ్యాచ్ జూలై 2న ప్రారంభం కానుంది. లీడ్స్లో జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసేందుకు చూస్తోంది.
తొలి టెస్ట్లో భారత్ తరఫున ఐదు సెంచరీలు వచ్చినా టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. 5 సెంచరీలు చేసి ఒక జట్టు ఓడిపోవడం క్రికెట్ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు బాదాడు. అయితే పంత్ సెంచరీలు భారత జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి.
పంత్ సెంచరీ కొట్టవద్దని కోరుతున్న ఫ్యాన్స్
రిషబ్ పంత్ ఒకే టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సాధించిన భారత తొలి వికెట్ కీపర్గా, ప్రపంచంలో రెండవ వ్యక్తిగా నిలిచాడు. 2001లో జింబాబ్వే ప్లేయర్ ఆండీ ఫ్లవర్ మాత్రమే ఇదివరకు ఈ ఘనత సాధించాడు. విదేశీ టెస్టుల్లో పంత్ ఇప్పటివరకు 6 సెంచరీలు సాధించాడు.
అయితే, భారత్ తరఫున పంత్ ను విదేశాల్లో సెంచరీలు చేయవద్దని భారత ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఎందుకంటే విదేశాల్లో పంత్ సెంచరీ చేసిన ప్రతిసారి భారత్ జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే పంత్ ను సెంచరీ చేయవద్దని టీమిండియా ఫ్యాన్స్ కోరుతున్నారు.
విదేశాల్లో పంత్ సెంచరీలు.. భారత జట్టు ఫలితాలు ఎలా ఉన్నాయి?
విదేశాల్లో పంత్ కొట్టిన 6 టెస్టు సెంచరీలు - భారత మ్యాచ్ ఫలితాలను గమనిస్తే.. 2018లో ఓవల్ లో ఇంగ్లాండ్ పై పంత్ 114 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. కానీ, భారత జట్టు ఓడిపోయింది. 2019లో ఆస్ట్రేలియా పై సిడ్నీలో 159 పరుగుల నాక్ ఆడగా, ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
2022లో దక్షిణాఫ్రికాపై 100 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు పంత్. ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఓడిపోయింది. 2022లో ఇంగ్లాండ్ పై 146 పరుగుల నాక్ ఆడగా, ఇక్కడ కూడా భారత్ ఓడిపోయింది. 2025లో లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడాడు. ఇక్కడ కూడా భారత జట్టు ఓడిపోయింది.
మొత్తంగా పంత్ కొట్టిన 6 సెంచరీలలో 5 మ్యాచ్లు భారత్ ఓడిపోయింది. ఒక మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. ఒక్కసారి కూడా గెలవలేదు. అందుకే పంత్ సెంచరీ కొట్టవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.
పంత్ అదరగొట్టిన ఫలితం రాలేదు
ఇటీవల లీడ్స్లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు. దీంతో ఒకే టెస్ట్ మ్యాచ్లో రెండు సెంచరీలు సాధించిన అరుదైన ఘనత అందుకున్నాడు. కానీ, ఆ సెంచరీలు భారత్కు విజయాన్ని అందించలేకపోయాయి. ఈ ఫలితంతో పంత్ సెంచరీ శాపం అంటూ చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
గెలుపు కోసం పంత్ సెంచరీలు కావు.. అంతకుమించి కావాలి !
రిషబ్ పంత్ అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ, జట్టు విజయం దక్కకపోవడం భారత ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగించింది. రాబోయే ఎడ్జ్ బాస్టన్ పంత్ సెంచరీ శాపం తొలగుతుందేమో చూడాలి. సెంచరీ కాకుండా పంత్ బ్యాట్ నుంచి డబుల్ సెంచరీలు లేదా సెంచరీ లోపు పెద్ద నాక్ రావాలని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఎడ్జ్ బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేసి ముందుకు సాగాలని భారత్ చూస్తోంది. తొలి టెస్టులో సెంచరీల మోత మోగించిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ లు రాబోయే మ్యాచ్ లలో కూడా అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.