పాక్ ను చిత్తు చేసిన యశస్వీ జైశ్వాల్ ఓ పానీపూరీ సెల్లర్
అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన యశస్వీ జైశ్వాల్ ఒకప్పుడు పానీపూరీ సెల్లర్. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పుకున్నాడు.
హామిల్టన్: టీమిండియా జట్టులోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న యశస్వీ జైశ్వాల్ అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్ పై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో అదరగొట్టాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇతను 11 ఏళ్ల వయస్సులో తండ్రితో ముంబైకి చేరుకున్నాడు. పాకిస్తాన్ పై సెంచరీ చేసి భారత్ ను ఫైనల్లోకి తీసుకెళ్లాడు.
పూట గడవడమే కష్టంగా ఉన్న స్థితి నుంచి ఐపిఎల్ కారణంగా అతను కోటీశ్వరుడయ్యాడు. రెండేళ్ల క్రితం వరకు ముంబై వీధుల్లో జీవనభృతి కోసం అతను పానీ పూరీ అమ్మేవాడు. అతడిలోని ప్రతిభను గుర్తించి, అతని దుర్భర స్థితిని గమనించి కోచ్ జ్వాలా సింగ్ ఆదుకోవడంతో అతను క్రికెట్ మీద దృష్టి పెట్టాడు. దాంతో అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read: అండర్ 19 వరల్డ్ కప్ : భారత్ చేతిలో పాక్ చిత్తు.. కారణం ఇదే..
17 ఏళ్ల ముంబై క్రికెటర్ దేశవాళీ క్రికెట్ లో అత్యంత వేగంగా ముందుకు దూసుకొచ్చాడు. పరిమిత 50 ఓవర్ల మ్యాచులో డబుల్ సెంచరీ చేసి, ఆ ఘనతను సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. దాంతో అతని పేరు వెలుగులోకి వచ్చింది.
ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో జైస్వాల్ ఆ ఘనతను సాధించాడు. అతని బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా, రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ముంబై చేరుకున్న యశస్వి ఆజాద్ మైదానంలోని ముంబై యునైటెడ్ క్లబ్ టెంట్ లో మూడేళ్లు గడిపాడు. పానీపురి అమ్మి జీవనం సాగించేవాడు.
Also Read: అండర్-19 ప్రపంచకప్: పాక్పై ఘనవిజయం, ఫైనల్లో భారత్
రంజీ ట్రోఫీ క్రికెట్ లో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన యశస్వి ప్రస్తుతం అండర్ 19 జట్టులో కొనసాగుతున్నాడు. ఐపిఎల్ అతన్ని కోటీశ్వరుడిని చేసింది. అండర్ 19 వరల్డ్ కప్ లో సత్తా చాటిన యశస్వీకి టీమిండియా జట్టులో కూడా స్థానం దొరకవచ్చు.