Virat kohli: పోయింది కెప్టెన్సీనే.. యాటిట్యూడ్ కాదు.. స్టేడియంలో అదే జోష్ కొనసాగించిన విరాట్..
Ind Vs SA: వన్డే కెప్టెన్సీ వివాదం నేపథ్యంలో గ్రౌండ్ లో విరాట్ ఎలా ఉంటాడు..? గతంలో మాదిరిగానే దూకుడును కొనసాగిస్తాడా..? లేక అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తాడా..? అని భారత క్రికెట్ అభిమానుల్లో ఒకటే ఆందోళన. కానీ...
టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ ఇటీవలే వన్డే జట్టు సారథిగా వైదొలిగాడు. బీసీసీఐ, దాని అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో విబేధాల కారణంగా ఆ వ్యవహారం రచ్చరచ్చగా మారి భారత క్రికెట్ లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ అంతా ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కోహ్లి ఎలా రాణిస్తాడు..? మైదానంలో పాత దూకుడును కొనసాగిస్తాడా..? లేదా బీసీసీఐపై కోపంతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తాడా..? అని అతడి అభిమానులతో పాటు భారత క్రికెట్ అభిమానుల్లో ఒకటే టెన్షన్. కానీ విరాట్ మాత్రం తాను కోల్పోయింది కెప్టెన్సీనే గానీ యాటిట్యూడ్ ను కాదు అని నిరూపిస్తున్నాడు.
భారత పేస్ గుర్రాలు బుమ్రా, షమీ, సిరాజ్ లు వికెట్ల కోసం పోటీ పడుతుంటే వారిని ఉత్సాహపరుస్తూ తానూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు కోహ్లి. మైదానంలో స్టెప్పులేస్తూ.. స్లిప్స్ లో కెఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో ముచ్చటిస్తూ సందడి సందడిగా కనిపించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 177 పరుగుల వద్ద ఉండగా అశ్విన్ ఓవర్లో ఫీల్డింగ్ సెట్ చేసుకుంటూనే కాలు కదిపాడు. పక్కనున్న ఆటగాడు ఏదో అంటుంటే తల ఊపుతూనే.. స్టేడియంలో వినిపిస్తున్న బీట్ కు అనుగుణంగా డాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది.
దీనిపై కోహ్లి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘పోయింది కెప్టెన్సీనే.. యాటిట్యూడ్ కాదు.. కోహ్లి కింగ్.. ’ ‘బిందాస్ కోహ్లి..’ ‘కింగ్ ఎక్కడున్నా కింగే..’ ‘నువ్వు అందర్లాంటి కెప్టెన్ వి కాదు. ఎక్కడున్నా కింగ్ వే. నువ్వు ఆటను ఎంజాయ్ చేసే విధానానికి మేం ఫిదా అవుతాం...’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక స్టేడియంలో కాలు కదపడం కోహ్లికి ఇదేం కొత్త కాదు. గతంలో కూడా పలు సందర్భాలలో అతడు లెగ్స్ షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆట విషయం పక్కనబెడితే గ్రౌండ్ లో కోహ్లి హావబావాలు, యాటిట్యూడ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తొలి రోజు ఆకట్టుకున్నా మూడో రోజు మన బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. దీంతో మనోళ్లు బౌలింగ్ ఎలా చేస్తారో..? వాళ్లకు అలవాటైన పిచ్ లపై సఫారీల వీర బాదుడు తప్పదనుకున్నారు అభిమానులు. కానీ భారత పేస్ దళం దాడికి దక్షిణాఫ్రికా తోక ముడిచింది. దీంతో కోహ్లి ఆనందానికి అవధుల్లేవు.
ఇక ఈ టెస్టులో భారత్ ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో కెఎల్ రాహుల్ సెంచరీతో 327 పరుగులు చేసిన భారత్.. దక్షిణాఫ్రికాను 197 రన్స్ కే ఆలౌట్ చేసింది. మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా భారత్ 146 పరుగుల ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు తొలి సెషన్ ఆట కీలకం కానున్నది.