Virat Kohli: కోహ్లి మరో ఘనత..దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరణ
Virat Kohli Wax Statue: భారత క్రికెట్ జట్టు సారథి మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లి మైనపు విగ్రహం వార్తల్లో చర్చనీయాంశమైంది.
భారత జట్టు (Team India)కు మూడు ఫార్మాట్ లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి (Virat Kohli) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ (Madam Tussauds) మ్యూజియంలో నిర్వాహకులు సోమవారం అతడి మైనపు విగ్రహాన్ని (Kohli Wax Statue) ఆవిష్కరించారు. ఈ విగ్రహంలో కోహ్లి.. టీమిండియా కొత్త జెర్సీ (Team India New Jersey)ని (ప్రపంచకప్ లో ధరించేది కాదు) వేసుకుని తనదైన బ్యాటింగ్ స్టైల్ తో అదరగొట్టాడు.
కోహ్లి మైనపు విగ్రహం ఆవిష్కరించడం ఇదేం కొత్త కాదు. ఇంతకుముందు ఇదే మేడమ్ టుస్సాడ్స్ సంస్థ.. 2018 లో ఢిల్లీ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా లండన్ మ్యూజియంలో మరొకటి పెట్టారు. దీనిని లార్డ్స్ లో ప్రదర్శనకు ఉంచారు. ఇక తాజాగా దుబాయ్ లో ఆవిష్కరించింది మూడోది కావడం విశేషం.
ఆధునిక క్రికెట్ లో ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందిన కోహ్లి.. మూడు ఫార్మాట్ లలోనూ అదరగొడుతున్నాడు. తనతో పాటు సమాంతరంగా ఆడుతున్న ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. టెస్టు, వన్డేలలో ప్రతిభ చాటుతుండగా విరాట్ మాత్రం టీ20లలో కూడా సత్తా చూపుతున్నాడు.
T20 Worldcup: ప్రెస్ మీట్ మధ్యలో ఆపేసిన బంగ్లాదేశ్ కెప్టెన్.. సారీ చెప్పిన స్కాట్లాండ్
మూడు ఫార్మాట్ లలో కలిపి బ్యాటింగ్ యావరేజీ 50 కి పైగా ఉంది. మోడ్రన్ క్రికెట్ లో ఇంత సగటు ఉన్న క్రికెటర్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఇదిలాఉండగా.. యూఏఈలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ తర్వాత కోహ్లి.. భారత టీ20 కెప్టెన్ గా వైదొలగనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.