T20 Worldcup: ప్రెస్ మీట్ మధ్యలో ఆపేసిన బంగ్లాదేశ్ కెప్టెన్.. సారీ చెప్పిన స్కాట్లాండ్
ICC T20 World Cup2021: టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా.. ప్రెస్ మీట్ ను మధ్యలో ఆపేయడం చర్చనీయాంశమైంది.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 world cup) లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్ (Qualifying rounds) లో ఆదివారం స్కాట్లాండ్ (Scotland) జట్టు బంగ్లాదేశ్ (bangladesh)తో పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో స్కాట్లాండ్ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. స్కాట్లాండ్ ఆటగాడు క్రిస్ గ్రీవ్స్ (chris greaves) అద్భుత ఆటతో ఆ జట్టుకు విజయం దక్కింది.
ఇదిలాఉండగా.. మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ (Bangladesh Captain) మహ్మదుల్లా (Mahmudullah) ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ ఓడిపోవడంపై పాత్రికేయులు మహ్మదుల్లాపై ప్రశ్నలు అడిగారు. బంగ్లా కెప్టెన్ సమాధానం చెబుతూ.. కాసేపు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సైలెంట్ అయ్యాడు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
మహ్మదుల్లా పాత్రికేయులతో ముచ్చటిస్తుండగా.. గెలిచిన సంబరంలో ఉన్న స్కాట్లాండ్ ఆటగాళ్లు తమ జాతీయ గీతాన్ని బిగ్గరగా పాడారు. విజయానందంలో ఉన్న వాళ్లు.. బంగ్లా కెప్టెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను పట్టించుకోలేదు. దీంతో మహ్మదుల్లా కొద్దిసేపు ఆ సమావేశాన్ని ఆపి.. స్కాట్లాండ్ జాతీయ గీతం అయిపోగానే తిరిగి మళ్లీ ప్రారంభించాడు.
దీనిపై క్రికెట్ స్కాట్లాండ్ మహ్మదుల్లాకు క్షమాపణలు చెప్పింది. ఇంకోసారి తాము ఇలా చేయబోమని తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇక తమ జాతీయ గీతం సమయంలో సంయమనం పాటించిన మహ్మదుల్లాపై ఆ జట్టు ప్రశంసలు కురిపించింది. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగుల వద్దే ఆగింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించిన స్కాట్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ గ్రీవ్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఇది కూడా చదవండి: T20 WorldCup: ఒకప్పుడు అమెజాన్ డ్రైవర్.. ఇప్పుడు టీ20 స్టార్.. స్కాట్లాండ్ స్టార్ గ్రీవ్స్ సక్సెస్ స్టోరీ