Ind Vs SA: సౌతాఫ్రికాలో తొలి సిరీస్ గెలుపు దాహం తీరేనా..? స్టార్ స్పోర్ట్స్ ప్రోమో అదుర్స్..
India Tour Of South Africa: ఇటీవలి కాలంలో విదేశీ గడ్డల మీద కూడా టీమిండియా అదరగొడుతున్నది. ఆసీస్ ను వారి స్వంత గడ్డపై ఓడించడం, ఇంగ్లాండ్ సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించడం వంటివి భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే.
తొలి విజయం ఎప్పుడు మధురమైనదే. అసలు అంచనాలే లేకుండా 1983 ప్రపంచకప్ లో అడుగుపెట్టిన కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత ఆటగాళ్లు.. ఏకంగా కప్ తో తిరిగొచ్చారు. ఆ తర్వాత ఎన్నో విజయాలు సాధించినా ఫస్ట్ వరల్డ్ కప్ విక్టరీ ఎప్పటికీ మరిచిపోనిది. 2007లో టీ20 ప్రపంచకప్ లో కూడా ఇదే పరిస్థితి. ఇక స్వదేశంలో తప్ప విదేశీ గడ్డలమీద గెలవదన్న అపప్రదను తొలిగించుకుంటూ గత కొద్దికాలంగా టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తున్నది. పలు అగ్రదేశాలపై టెస్టు సిరీస్ లను సొంతం చేసుకుంటున్నది. మరి త్వరలోనే దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లనున్న విరాట్ కోహ్లీ సేన.. తొలి సిరీస్ విజయ దాహాన్ని తీర్చుతుందా..? ఆఫ్రికా గడ్డపై సిరీస్ గెలుస్తుందా..?
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు అఫిషియల్ బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ‘First ka Thirst’ అనే పేరు మీద విడుదల చేసిన ఈ ప్రోమోలో ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఆసీస్ గడ్డమీద భారత్ సాధించిన మొదటి సిరీస్ విజయాలను గుర్తు చేస్తూ.. టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.
దక్షిణాఫ్రికాతో భారత్.. ఇంతవరకు టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఈ గడ్డ మీద సిరీస్ నెగ్గాలని టీమిండియా పలుసార్లు ప్రయత్నించినా దారుణంగా విఫలమైంది. 1992 నుంచి భారత్.. సౌతాఫ్రికాతో వారి దేశంలో టెస్టులలో తలపడుతున్నది. అప్పట్నుంచి ఇప్పటిదాకా.. వారి సొంత గడ్డపై మన జట్టు సఫారీలను ఓడించలేదు. 29 ఏండ్లుగా ఊరిస్తున్న సిరీస్ విజయాన్ని సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లీ సేన భావిస్తున్న నేపథ్యంలో స్టార్ స్టోర్ట్స్ ప్రోమో ఆకట్టుకుంటున్నది.
వీడియోలో ఇండియా.. ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ పై సాధించిన తొలి టెస్టు సిరీస్ (1971) విజయాన్ని, 2004లో పాకిస్థాన్ గడ్డపై గెలిచిన సిరీస్ ను, 2018లో ఆసీస్ ను వారి స్వంత గడ్డమీద ఓడించిన విషయాలను గుర్తు చేస్తూ చూపించారు. అంతేగాక విరాట్ సేన.. దక్షిణాఫ్రికాలో తొలి సిరీస్ దాహాన్ని తీరుస్తుందా..? అంటూనే.. ‘జట్టును నమ్మండి’ అని అర్థం వచ్చేలా (బిలీవ్ ఇన్ బ్లూ) ప్రోమోను కట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇటీవలి కాలంలో విదేశీ గడ్డల మీద కూడా టీమిండియా అదరగొడుతున్నది. ఆసీస్ ను వారి స్వంత గడ్డపై ఓడించడం, ఇంగ్లాండ్ సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించడం వంటివి భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే. ఇక టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న భారత పేస్ ద్వయం బుమ్రా, మహ్మద్ షమీ లు ఈ సిరీస్ కు సిద్ధమయ్యారు. సిరాజ్ వీరికి కలవడం భారత్ కు బలాన్నిచ్చేదే. బ్యాటింగ్ లో కోహ్లీ, రోహిత్, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, రహానే, పుజారాలతో భారత్ దుర్బేధ్యంగా ఉంది.
టీమిండియా-సౌతాఫ్రికా మధ్య ఇప్పటివరకు ఏడు సార్లు టెస్టు సిరీస్ (దక్షిణాఫ్రికా గడ్డ మీద) లు జరుగగా ఒక్క సిరీస్ మాత్రమే భారత్ డ్రా చేసుకోగలిగింది. మిగిలిన ఆరు సార్లు ఆతిథ్య జట్టుదే విజయం. మరి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆ దాహాన్ని తీర్చుతుందా..?