T20 Worldcup2021: భువీని తుది జట్టులోకి తీసుకోకపోవడమే ఉత్తమం.. అతడి స్థానంలో శార్ధూలే బెస్ట్ అంటున్న సీనియర్లు
Ajit Agarkar: ఈనెల 24 నుంచి టీ20 ప్రపంచకప్ వేటను ప్రారంభించనున్న భారత జట్టు.. పేసర్ భువనేశ్వర్ కుమార్ ను తుది జట్టుకు ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup 2021) లో కూర్పు కోసం భారత జట్టు (Team India) మల్లగుల్లాలు పడుతున్నది. ఎవరిని ఏ స్థానంలో ఆడించాలి..? ఎంతమంది స్పెషలిస్టు బౌలర్లుండాలి..? స్పిన్నర్లు ఎలా ఆడతారు..? ఇవన్నీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) మదిలో మెదులుతున్న ప్రశ్నలు. వార్మప్ మ్యాచ్ లో భాగంగా భారత బౌలర్లు తేలిపోయినా.. బ్యాట్స్మెన్ మాత్రం ఇరగదీశారు. అయితే భారత (India) పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvaneshwar Kumar)ను తుది జట్టులోకి తీసుకోకపోవడమే ఉత్తమమని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయమై భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మాట్లాడుతూ... ‘ఫిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటే కోహ్లి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతాడు. లేదంటే ముగ్గురేసి చొప్పున పేసర్లు, స్పిన్నర్లు ఉండాలి. జట్టులో స్పిన్ ఆప్షన్స్ కు కొదవలేదు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆల్ రౌండర్. అతడు బ్యాటింగ్ కూడా చేస్తాడు. కానీ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) బౌలింగ్ చేయకుంటే బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur), జడేజా, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ లను తుది జట్టులోకి తీసుకోవడం ఉత్తమం’ అని అన్నాడు.
ఇక ఇదే విషయమై భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (Parthiv patel) స్పందిస్తూ.. ‘ఇంగ్లండ్ (England)తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి ఐదుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాడు. దీనిని బట్టి చూస్తే హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడం కష్టమే అనిపిస్తున్నది. ఇక టీమిండియా పేసర్ భువనేశ్వర్ పేలవ ఫామ్ నన్ను ఆందోళనకు గురి చేస్తున్నది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) తరఫున ఆడిన అతడు 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. భువీ లయ తప్పినట్టు కనిపిస్తున్నాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో తేలిపోయాడు’ అని అన్నాడు.
Also Read: Virat Kohli: కోహ్లి మరో ఘనత..దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరణ
సోమవారం ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లేసిన భువీ.. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ కు ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో భువీని పక్కనబెట్టి.. ఆల్ రౌండర్ గా సేవలందించే శార్దూల్ ను తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి రేపు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో భువీ.. ఫామ్ ను అందుకుని జట్టులో ఉంటాడా..? లేదా పాకిస్తాన్ మ్యాచ్ కు ముందే బెంచ్ కు పరిమితమవుతాడా..? అన్నది వేచి చూడాల్సిందే.