Sourav Gangulys: పూరీ సముద్ర తీరంలో వాటర్ స్పోర్ట్స్ సమయంలో జరిగిన పడవ ప్రమాదంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుటుంబం కూడా ఉంది.
Sourav Ganguly: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుటుంబం పడవ ప్రమాదంలో చిక్కుకుంది. ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో పడవ బోల్తా పడటంతో గంగూలీ ఫ్యామిలీ ప్రమాదానికి గురైంది. దాదా అన్నయ్య స్నేహశీష్ గంగూలీ కుటుంబానికి పూరీ తీరంలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని పీటీఐ నివేదించింది. వాటర్ స్పోర్ట్స్ సమయంలో వారిని తీసుకెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లైఫ్గార్డులు నీళ్లలో పడిన వారిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.
ఈ ప్రమాదంపై పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ మాట్లాడుతూ.. "ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించామని" తెలిపారు. ప్రమాదానికి గురైన స్నేహశీష్ గంగూలీ మాట్లాడుతూ.. "ఇప్పటికీ షాక్లో ఉన్నాను. ఇది నిజంగా అదృష్టం. లైఫ్గార్డులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం" అని అన్నారు.
అర్పిత గంగూలీ మాట్లాడుతూ.. "ఒక క్షణంలో మేము ఇక బతకము అనిపించింది. ఆ జగన్నాథ స్వామి దయ వల్ల మేము బతికాము. పడవ నడిపే వారికి సరైన లైసెన్స్ ఉందా లేదా అన్నదానిపై ప్రభుత్వం విచారణ చేయాలి. వాటర్ స్పోర్ట్స్ విషయంలో పర్యాటకుల భద్రతను మొదటి ప్రాధాన్యతగా పరిగణించాలి" అని పేర్కొన్నారు.
అలాగే, "ఆ సమయంలో సముద్రం చాలా అలలతో ఉధృతంగా ఉంది. పడవ సామర్థ్యం 10 మంది వరకు ఉన్నా, కమర్షియల్ కారణాల వల్ల కేవలం నలుగురైదుగురిని బోర్డ్ చేశారు. ఇది ఆ రోజు సముద్రంలోకి వెళ్లిన చివరి పడవ. మేము ముందుగా వెళ్లడం ప్రమాదకరమని చెప్పినా, నిర్వాహకులు సర్దిచెప్పారు" అని వెల్లడించారు.
గంగూలీ కుటుంబాన్ని రక్షించడానికి లైఫ్గార్డులు గాలితో నిండిన ఫ్లోట్స్ ఉపయోగించారు. వారంతా సురక్షితంగా బయటపడినట్టు అధికారిక వర్గాలు తెలియజేశాయి. బోటు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్పిత గంగూలీ అన్నారు. అలాగే, “పూరీ బీచ్ సముద్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ ను ఇక్కడ నిషేధించాలని పోలీసు సూపరింటెండెంట్కు, ముఖ్యమంత్రికి నేను కోల్కతా చేరుకున్న తర్వాత లేఖ రాస్తాను" అని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఈ ఘటన ఒడిశాలోని పర్యాటక వాటర్ స్పోర్ట్స్ భద్రతా ప్రమాణాలపై కీలక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదిలా ఉండగా, ఒడిశా వాతావరణ శాఖ ప్రకారం, మే 27 న బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 30 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భువనేశ్వర్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ మనోరమ మోహంతి పేర్కొన్నారు.