Smriti Mandhana Century Leads India to Tri-Series Victory: స్మృతి మంధాన సెంచరీతో ఇండియా శ్రీలంకను 96 పరుగుల తేడాతో ఓడించింది. 343 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక 245 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ట్రైసిరీస్ ఛాంపియన్ గా నిలిచింది.
Team India: ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కొత్త రికార్డు సృష్టించింది. వన్డే ట్రై నేషన్ సిరీస్ ఫైనల్లో శ్రీలంకను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 50 ఓవర్లలో 342 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా శ్రీలంక 245 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన ఇండియా ఈ మ్యాచ్ను గెలుచుకుంది.
స్మృతి మంధాన సెంచరీతో భారీ స్కోరు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన 102 బంతుల్లో 116 పరుగులు చేసింది. ఇది ఆమె వన్డే కెరీర్లో 11వ సెంచరీ. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. హర్లీన్ డియోల్ 47, జెమిమా రోడ్రిగ్స్ 44, హర్మన్ప్రీత్ కౌర్ 41, ప్రతీకా రావల్ 30, దీప్తి శర్మ 20, అమన్జ్యోత్ కౌర్ 18 పరుగులు చేశారు. దీంతో ఇండియా 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మల్కీ మదార, దేవ్మీ విహంగా, సుగంధికా కుమారి చెరో 2 వికెట్లు, ఇనోకా రణవీర 1 వికెట్ తీసుకున్నారు.
బౌలింగ్లోనూ అదరగొట్టిన ఇండియా
343 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చమరి అటపట్టు 51, ఎన్.డి.సిల్వా 48, హెచ్.ఎం. సమరవిక్రమ 26, వీ. గుణరత్న 36, ఎ. సంజీవని 28, ఎస్. కుమారి 27 పరుగులు చేశారు. నలుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇండియా బౌలర్లలో స్నేహ్ రాణా 4 వికెట్లు, అమన్జ్యోత్ కౌర్ 3 వికెట్లు, నల్లపరెడ్డి చరణి 1 వికెట్ తీసుకున్నారు.
ట్రై సిరీస్లో ఇండియా జోరు
ఇండియా, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరిగిన ట్రై నేషన్ సిరీస్ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో శ్రీలంకను 9 వికెట్ల తేడాతో ఓడించిన ఇండియా, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాను 15 పరుగుల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాను మళ్లీ 23 పరుగుల తేడాతో ఓడించిన ఇండియా, 4 మ్యాచ్ల్లో 3 గెలిచి ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది.