Asianet News TeluguAsianet News Telugu

ఒక్క ఓవర్ తో మ్యాచ్ ను మొత్తం తిప్పేశావ్.. ఠాకూరూ ఏందయ్యా ఇది..?

INDvsNZ ODI: న్యూజిలాండ్ తో శుక్రవారం ఆక్లాండ్ వేదికగా ముగిసిన  తొలి వన్డేలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 25 పరుగులొచ్చాయి.  
 

Shardul Thakur Brutally Trolled After He  Leaks 25 Runs in 1 Over
Author
First Published Nov 25, 2022, 7:33 PM IST

భారత్ - న్యూజిలాండ్ మధ్య  ఆక్లాండ్ వేదికగా ముగిసిన  తొలి వన్డేలో   కివీస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో  గెలుపొందింది. ఈ మ్యాచ్ లో  భారత బ్యాటింగ్ బాగానే ఉన్నా బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా  టీమిండియా మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ ఒక్క ఓవర్ లో భారత్ ఫలితాన్నే మార్చేశాడు. అతడు వేసిన  40 వ ఓవర్లో ఏకంగా 25 పరుగులొచ్చాయి. అప్పటివరకు ఇరు జట్లకూ విజయావకాశాలు ఉండగా ఆ ఒక్క ఓవర్ తో మ్యాచ్ కివీస్ వైపు మళ్లింది.  

ఈ మ్యాచ్ లో కివీస్ 39 ఓవర్లకు  216-3 స్కోరు వద్ద ఉండగా ధావన్.. శార్దూల్ కు బంతినిచ్చాడు. 40వ ఓవర్ వేసిన శార్దూల్ బౌలింగ్ లో టామ్ లాథమ్.. తొలి బంతిని సిక్సర్ గా మలిచాడు. రెండో బంతి వైడ్. తర్వాత వరుసగా నాలుగు ఫోర్లు. ఐదో బంతికి మళ్లీ వైడ్. ఆరో బంతికి లాథమ్ సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఈ ఓవర్లో మొత్తంగా 25 పరుగులొచ్చాయి. 39 వ ఓవర్ ముగిసేసరికి  70 బంతుల్లో 77 పరుగులతో ఉన్న లాథమ్.. ఆరు బంతుల్లో 23 పరుగులు రాబట్టి  సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈ ఓవర్ తర్వాత అతడు మరింత చెలరేగాడు. 

దీంతో మ్యాచ్ అనంతరం  శార్దూల్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.  పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘అసలు ఇతడు మనకు తెలిసిన లార్డ్ కాదు’ అని  కామెంట్స్ చేస్తున్నారు. శార్దూల్ ను అభిమానులంతా ‘లార్డ్’ అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. మరికొంతమంది.. ‘సీఎస్కే నుంచి వెళ్లాక  లార్డ్  ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది.. ’, ‘లెగ్ సైడ్  ఒక్కడే ఫీల్డర్ ఉన్నా అటుదిశగా బంతులు వేసే ఏకైక బౌలర్ ఠాకూర్ మాత్రమే..’, ‘మనం లార్డ్ ఠాకూర్ ను అంచనా వేయలేం. ఎందుకంటే అతడు ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

మ్యాచ్ ముగిశాక ధావన్ కూడా భారత బౌలింగ్  వల్లే ఓడిందని కామెంట్స్ చేయడం గమనార్హం. ధావన్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ పరంగా మేం బాగా ఆడాం.  కివీస్ ముందు ఉంచిన లక్ష్యం కూడా  మంచిదే.  రెండో ఇన్నింగ్స్ లో తొలి 15 ఓవర్లు బంతి బౌలర్లకు అనుకూలించింది. మిగిలిన గ్రౌండ్స్ కంటే ఇది (ఆక్లాండ్ ఈడెన్ పార్క్) కాస్త డిఫరెంట్ గా ఉంది. ఈ మ్యాచ్ లో మేం చాలా వరకు  షాట్ బంతులు విసిరాం.. అదే మా కొంపముంచింది. ఈ మ్యాచ్ లో  టామ్ లాథమ్  మా బౌలర్లు విసిరిన  షాట్ బంతులను టార్గెట్ గా చేసుకుని విజృంభించాడు. 40వ ఓవర్లో అతడు సిక్సర్ తో సహా  వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అదే మా నుంచి మ్యాచ్ ను దూరం చేసింది.   మ్యాచ్ లో మా వ్యూహాలు సరిగా అమలు కాలేదు...’అని వ్యాఖ్యానించాడు.  

 

 

ఈ మ్యాచ్ లో  307 పరుగుల లక్ష్య ఛేదనలో  కివీస్  ప్రమాదకర ఫిన్ అలెన్ (22), డెవాన్ కాన్వే (24), డారిల్ మిచెల్ (11) వికెట్లను  తొలి 20 ఓవర్ల లోపే కోల్పోయింది.  88-3 గా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్.. 104 బంతుల్లోనే 19 ఫోర్లు, 5 సిక్సర్లతో  145 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  అతడికి  సారథి కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్సర్) సహకరించాడు.   కేన్ మామ సెంచరీ మిస్ అయినా   మ్యాచ్ మాత్రం కివీస్ గెలిచింది.  లక్ష్యాన్ని కివీస్.. 47.1 ఓవర్లలోనే ఛేదించింది. 

 

 

అంతకుముందు భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భారత జట్టులో కెప్టెన్ ధావన్ (72),  శుభమన్ గిల్ (50) లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్  (80) రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్.. 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి భారత స్కోరును  300 మార్క్ దాటించాడు.   ఈ మ్యాచ్ లో కివీస్ ను గెలిపించిన టామ్ లాథమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్ లో  ఒక మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్..  సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే  ఆదివారం జరుగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios