ఐపీఎల్ 2025లో మెరిసిన ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒకరు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పాటు ఇతడు కూడా చెలరేగడం వల్లే గుజరాత్ ప్లేఆఫ్స్ వరకు చేరుకోగలిగింది. చివరకు ఎలిమినేటర్ లో తన కెప్టెన్ గిల్ రికార్డునే బద్దలుగొట్టాడు సాయి సుదర్శన్.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది జిటి. దీంతో రెండో ట్రోఫీ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి.
శుభ్మన్ గిల్ నాయకత్వంలోని జీటీ లీగ్ మ్యాచ్లలో అద్భుతంగా ఆడినా ప్లేఆఫ్స్ లో కాస్త తడబడింది. ఈ ఐపిఎల్ సీజన్ మొత్తం అద్భుతంగా ఆడి ప్లేఆఫ్ లో ఒక్కమ్యాచ్ ఓడటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్ చేతిలో జిటి ఓడినా ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం అదరగొట్టాడు. ఎలిమినేటర్లో ముంబైపై 80 పరుగులు చేశాడు. జీటీ ఓడిపోయినా సాయి కొత్త రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో 700+ పరుగులు చేసిన అతి చిన్న వయస్కుడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. తన కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డును అధిగమించాడు. 2023లో గిల్ 23 ఏళ్ల 257 రోజుల వయసులో 890 పరుగులు చేశాడు. సుదర్శన్ 23 ఏళ్ల 227 రోజుల వయసులో 759 పరుగులు చేశాడు. ఈ సీజన్ ముగిసినా రికార్డ్ బుక్ లో సాయి పేరు చేరిపోయింది.
ఒకే సీజన్లో 700+ పరుగులు
ఒకే సీజన్లో 700+ పరుగులు చేసిన ఘనత సాధించిన ఐదో బ్యాట్స్మన్గా సాయి సుదర్శన్ నిలిచాడు. జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, శుభ్మన్ గిల్ లాంటి దిగ్గజాల జాబితాలో చేరాడు. 2016లో విరాట్ 963, 2023లో గిల్ 890, 2022లో బట్లర్ 863, 2016లో వార్నర్ 848 పరుగులు చేశారు.
సాయి సుదర్శన్ కి సూపర్ సీజన్
ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్ 15 మ్యాచ్ల్లో 55.40 సగటుతో 759 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓ సెంచరీ కూడా బాదాడు. పెద్ద లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అతడి సెంచరీ చాలా కీలకంగా మారింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా సెంచరీకి చేరువైన అతడు అనవసరపు షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. లేదంటే అతడి ఖాతాలో మరో సెంచరీ చేరిపోయేది… జిటి ఫైనల్ కు చేరేది. ఏదేమైనా జిటి విజయం సాధించకున్నా సాయి సుదర్శన్ లాంటి గొప్ప ఆటగాడిని వెలుగులోకి తెచ్చింది.