Sai Sudharsan: దేశవాళీ క్రికెట్ తో పాటు ప్రస్తుతం ఐపీఎల్ లో సూపర్ బ్యాటింగ్ తో అదరగొడుతున్న సాయి సుదర్శన్ భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ ఐపీఎల్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.

Sai Sudharsan: ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ స్థానంలో భారత జట్టుకు శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అలాగే, పలువురు యంగ్ ప్లేయర్లకు జట్టులో చోటుదక్కింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ కూడా ఉన్నాడు. భారత జట్టుకు ఎంపికైన తర్వాత తన తొలి టెస్ట్ క్రికెట్ అనుభవం ఊహించనిదని సాయి సుదర్శన్ అన్నాడు. 

"భారత జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఏ క్రికెటర్ అయినా, యువ క్రికెటర్ అయినా క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు, టెస్ట్ క్రికెట్ ఆడాలని, దేశం కోసం ఆడాలని కోరుకుంటారు" అని సాయి సుదర్శన్ అన్నాడు. క్రికెట్ కెరీర్ లో "అంతిమ లక్ష్యం ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్ ఆడటమే. కాబట్టి దానికి చాలా సంతోషంగా ఉంది" అని తెలిపాడు. 

కొత్త టాప్ ఆర్డర్‌లో సాయి సుదర్శన్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి దిగ్గజాలు రిటైర్ అయిన తర్వాత సాయి సుదర్శన్ భారత జట్టు కొత్త టాప్ ఆర్డర్‌లో భాగం కానున్నాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున ఓపెనింగ్ చేసే సాయి సుదర్శన్..  జాతీయ జట్టు తరపున ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. 

"దేశం కోసం ఆడటం అనేది ఒక క్రికెటర్‌కు చాలా గొప్ప అవకాశం. నేను ఎక్కడ ఆడాలనుకుంటున్నానో ఎంచుకునే స్థితిలో నేను లేను" అని సాయి సుదర్శన్ అన్నాడు. "కోచ్‌లు నన్ను ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడతాను. మానసికంగా, నైపుణ్యంతో ఆ అవకాశానికి సిద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తాను" అని  చెప్పాడు. "నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి. జట్టు నాకు ఏ స్థానం ఇచ్చినా దానికి సిద్ధంగా ఉండాలి. నేను దానికి సిద్ధంగా ఉంటాను" అని తెలిపాడు.

గిల్ కెప్టెన్సీలో సాయి సుదర్శన్ టెస్టు అరంగేట్రం

భారత టెస్టు జట్టుకు గిల్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం గిల్, సాయి సుదర్శన్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నారు. గుజరాత్ టైటాన్స్ లో తన కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో సాయి టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. "గత నాలుగు సంవత్సరాలుగా నేను శుభ్‌మన్ గిల్ ఎదుగుదలను చూస్తున్నాను. అతను చాలా ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్, చాలా నైపుణ్యం కలిగిన బ్యాట్స్‌మన్" అని సాయి ప్రశంసలు కురిపించాడు. "అతను ఖచ్చితంగా దేశానికి గొప్ప విజయాలు అందిస్తాడని నేను భావిస్తున్నాను. నా మొదటి టెస్ట్ సిరీస్‌లో అతని కెప్టెన్సీలో ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపాడు. 

ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐపీఎల్‌పై దృష్టి పెట్టిన సాయి సుదర్శన్ 

జూన్ 20న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ముందు సాయి సుదర్శన్, గిల్ ఇద్దరూ ఇండియా A జట్టుతో కలిసి ఇంగ్లాండ్ లయన్స్‌తో జూన్ 6న నార్తాంప్టన్‌లో ప్రారంభమయ్యే రెండో నాలుగు రోజుల మ్యాచ్‌లో పాల్గొంటారు. "ఐపీఎల్‌లో ఉన్నప్పుడు అది ముఖ్యం. ముందు దాన్ని పూర్తి చేసి, తర్వాత ఇంగ్లాండ్ పర్యటన గురించి ఆలోచిస్తాను" అని సాయి చెప్పాడు. "టెస్ట్ సిరీస్‌కు సిద్ధం కావడానికి సమయం ఉంటుంది. ఆ సమయాన్ని ఉపయోగించుకుంటాను" అని తెలిపాడు. ప్రస్తుతానికి సాయి సుదర్శన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై దృష్టి సారించారు.

వైట్-బాల్ నుండి రెడ్-బాల్ క్రికెట్‌కు మారడం ప్రత్యేకం

వేగవంతమైన టీ20 ఫార్మాట్ నుండి టెస్ట్ క్రికెట్‌కు మారడం ఒక ప్రత్యేకమైన సవాలు అని సాయి సుదర్శన్ అన్నాడు. "వైట్ బాల్ నుండి రెడ్ బాల్‌కు మారడానికి కొంత సమయం పడుతుంది" అని పేర్కొన్నాడు. "నేను నా ఆటతీరుపై, నా ఓపికపై ఎక్కువగా దృష్టి పెడతాను" అని చెప్పాడు. "మీరు ఎంత ఓపికగా ఉంటే, అది మైదానంలో అంతగా ప్రతిబింబిస్తుంది. టెస్ట్ క్రికెట్ అంతా ఓపిక, ఫోకస్ కు సంబంధించింది. నేను దానిపై ఎక్కువగా దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అది గొప్ప అనుభవంగా ఉంటుంది" అని అన్నాడు.