రోహిత్ శర్మకు గాయం: కేఎల్ రాహుల్ స్పందన ఇదీ...
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పిక్క కండరాలు పట్టేయడంతో బాధపడుతున్నాడు. అయితే, రెండు మూడు రోజుల్లో అతను కోలుకోవచ్చునని కేఎల్ రాహుల్ చెప్పాడు. అతన్ని పరిశీలనలో ఉంచామని బీసీసీఐ తెలిపింది.
ముంబై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయం పాలయ్యాడు. న్యూజిలాండ్ పై జరిగిన చివరి టీ20లో పిక్క కండరాలు పట్టేశాయి. బ్యాటింగ్ చేస్తుండగా పిక్క కండరాలు పట్టేయడంతో అతను ఫీల్డింగ్ కూడా రాలేదు. రోహిత్ శర్మ గాయంపై టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ వివరణ ఇచ్చాడు.
రోహిత్ శర్మ ఆరోగ్యం ఫరవాలేదని ఆయన చెప్పాడు. అతడు పిక్క కండరాల గాయంతో బాధపడడడం దురదృష్టకరమని అన్నాడు. చివరి టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించాడు.
Also Read: విరాట్ కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
భారత ఇన్నింగ్సులో రోహిత్ శర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ పిక్క కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. ఆ తర్వాత కూడా అతను బాధపడ్డాడు. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ నాయకత్వం బాధ్యతలు తీసుకున్నాడు.
రోహిత్ శర్మను ప్రస్తుతం పరిశీలనలో ఉంచామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని చెప్పింది. కాగా, రోహిత్ శర్మ రెండు మూడు రోజుల్లో కోలుకోవచ్చునని రాహుల్ చెప్పాడు.
Also Read: టీమిండియా క్లీన్ స్వీప్.... ఆనందంతో చిందులేసిన చాహల్, శ్రేయాస్
భారత్ బుధవారం నుంచి న్యూజిలాండ్ పై 3 వన్డేల సిరీస్ అడనుంది. ఐదు టీ20ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసందే.