రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18వ ఐపీఎల్లో ఛాంపియన్షిప్ గెలిచింది. పంజాబ్ కింగ్స్పై ఫైనల్లో 6 పరుగుల తేడాతో గెలిచి తొలి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. మాజీ యజమాని విజయ్ మాల్యాతో సహా చాలా మంది జట్టును అభినందించారు.
IPL 2025 Final : రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు 18వ ఐపీఎల్లో ఛాంపియన్గా నిలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ థ్రిల్లింగ్ విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురుచూపుకు తెరపడింది. ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలవగానే మాజీ యజమాని విజయ్ మాల్యా ట్వీట్ చేసి జట్టును అభినందించారు.
‘’18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ అయ్యింది. 2025 టోర్నమెంట్ అంతా అద్భుతంగా ఆడింది. బలమైన జట్టు, మంచి కోచ్, సపోర్ట్ స్టాఫ్ వల్ల ధైర్యంగా ఆడింది. అందరికీ అభినందనలు. ‘’ఈ సాలా కప్ నమ్దే (ఈసారి కప్పు మనదే)'' అని విజయ్ మాల్యా ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2008 నుంచి ఐపీఎల్ ఆడుతోంది. 18వ ఐపీఎల్కు ముందు మూడు సార్లు ఫైనల్కు చేరింది. కానీ మూడుసార్లూ ఓడిపోయింది. 2008లో డెక్కన్ ఛార్జర్స్తో, 2011లో చెన్నై సూపర్ కింగ్స్తో, 2016లో సన్రైజర్స్ హైదరాబాద్తో ఓడిపోయింది.
ఈ సాలా కప్ నమ్దే :
గత కొన్నేళ్లుగా ఆర్సీబీ అభిమానులు ‘’ఈ సాలా కప్ నమ్దే (ఈసారి కప్పు మనదే) అని నినాదాలు చేస్తున్నారు. కానీ ఆర్సీబీ కప్పు గెలవలేకపోయింది. గతేడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ మహిళా జట్టు ఐపీఎల్ గెలిచింది. ఇప్పుడు రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఆర్సీబీ 18వ ఐపీఎల్లో అన్ని అడ్డంకులను అధిగమించి ఛాంపియన్గా నిలిచింది.
ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్. పంజాబ్ కింగ్స్ మంచి ఆరంభం పొందినా కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ దాడికి తట్టుకోలేక 7 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలిచింది. ఆర్సీబీ విజయానికి సచిన్ టెండూల్కర్, సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కుమారస్వామి వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
