ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుదూరంలో నిలిచింది. తమ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లడంతో ఆర్సిబి అభిమానులు సంబరాలకు సిద్దమయ్యారు. ‘ఈ సాల కప్ నమ్దే’ అంటున్న ఫ్యాన్స్ సీఎం సిద్దరామయ్యకే సెలవు కావాలంటూ లేఖ రాసాడు.

Royal Challenger Bengaluru :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో ఫైనల్‌కి చేరిన మొదటి జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఓడించి నేరుగా ఫైనల్ కి చేరింది RCB. దీంతో ‘ఈ సాల కప్ నమ్దే (ఈసారి కప్ మాదే)' అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.  ఈ క్రమంలోనే ఫైనల్లో గెలిచాక మరింత భారీగా సంబరాలు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు… ఇందుకోసం సెలవు కావాలంటూ ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసాడో ఫ్యాన్.  

ఇలా ఐపిఎల్ ఫైనల్ జరిగే జూన్ 3న సెలవు కావాలంటూ సీఎంకు ఆర్సిబి ఫ్యాన్ రాసిన లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్సిబి అభిమానులంతా ఈ సెలవు డిమాండ్ కు మద్దతు తెలుపుతూ ఈ లేఖను వైరల్ చేస్తున్నారు. మరి అభిమానుల విజ్ఞప్తిని మన్నించి సిద్దరామయ్య సెలవు ఇస్తారేమో చూడాలి.  

 ఆర్సిబి ఫ్యాన్సా మజాకా..!

 ఐపిఎల్ లో ఫ్యాన్స్ బేస్ ఎక్కువగా ఉన్నా జట్లలో ఆర్సిబి ఒకటి. ఆ టీం ఇప్పటివరకు ఒక్క ఐపిఎల్ ట్రోఫీ గెలవకున్నా ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గలేరు.. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంతా ఆర్సిబిని ఇష్టపడతారు. ఇక కర్ణాటక ప్రజలు కూడా తమ హోం టీం ప్రదర్శన ఎలా వున్నా అభిమానిస్తారు. కానీ ఈసారి ఫ్యాన్స్ గర్వపడేలా ఆడుతోంది ఆర్సిబి. కలల కప్ కు అడుగుదూరంలో నిలిచింది. 

ఐపిఎల్ ఫైనల్ జూన్ 3న జరగనుంది.. చివరి మ్యాచ్ లో ఆర్సిబి గెలిస్తే మొదటిసారి ఐపిఎల్ కప్ అందుతుంది. ఈ అపురూప క్షణాల్లో సంబరాలు చేసుకునేందుకు తమకు సెలవు కావాలంటూ ఆర్సిబి అభిమాని శివనంద మల్లన్నవర్ సీఎం సిద్ధరామయ్యకు లెటర్ రాశాడు. క్వాలిఫయర్ 1 లో విజయం సాధించిన ఆర్సిబి ఫైనల్‌కి వెళ్లగానే ఈ లెటర్ రాశాడు. ఇప్పుడు ఈ లెటర్ వైరల్ అవుతోంది. 

రాష్ట్రంలోని ప్రతి ఆర్సిబి అభిమాని తరపున ఈ లెటర్ రాశానని శివనంద చెప్పాడు. ముఖ్యంగా జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సిబి గెలిస్తే సంబరాలు అంబరాన్ని అంటుతాయని… అందుకోసమే సెలవు ప్రకటించాలని కోరినట్లు తెలిపారు.  

ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సిబి గెలిస్తే జూన్ 3 ను పండగ జరుపుకుంటామని సదరు ఫ్యాన్ తెలిపాడు. ఆ రోజు ప్రభుత్వ సెలవు ప్రకటించాలని… ఈ అద్భుత విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది సెలవు ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్యను కోరాడు. ఫ్యాన్స్ కోరిక తీరిస్తూ సెలవు ప్రకటించాలని లెటర్‌లో కోరాడు. కర్ణాటక రాజ్యోత్సవాన్ని ప్రతి జిల్లాలో ఎలా జరుపుకుంటారో అదే విధంగా ఆర్సిబి ఫ్యాన్స్ సంబరాలు  జరుపుకోవడానికి సర్కారు అనుమతి ఇవ్వాలని లెటర్‌లో రాశాడు.

తన మనవిని సర్కారు పరిగణలోకి తీసుకుని సెలవు ప్రకటించాలని… సంబరాలకు అనుమతి ఇవ్వాలని ఆర్సిబి ఫ్యాన్ శివనంద్ ఈ లెటర్‌ ద్వారా కోరాడు. ఆర్సిబి ఫ్యాన్స్ అందరి తరపున ఈ మనవి చేస్తున్నానని రాశాడు.