Ajaz Patel: ముంబైలో అది సాధించడం మరిచిపోలేనిది.. వాళ్లిద్దరూ తనను గుర్తించడం చాలా పెద్ద విషయమన్న అజాజ్ పటేల్
Ajaz Patel: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లు తమ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి మరీ అభినందించడం తన జీవితంలో మరిచిపోలేనిదని న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అన్నాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో పదివికెట్లు తీసిన మూడో బౌలర్ (జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత) గా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. ప్రశంసల వర్షంలో తడుస్తున్నాడు. ముంబై లో ముగిసిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన అనంతరం తనను టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వచ్చి అభినందించడం జీవితంలో మరిచిపోలేనిదని సంతోషం వ్యక్తం చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడితే చాలనుకున్న తాను.. ఈ రేర్ రికార్డ్ ఫీట్ ను నమోదు చేయడం మాటల్లో వర్ణించలేనిదని చెప్పాడు.
అజాజ్ పటేల్ మాట్లాడుతూ.. ‘ముంబైలో ఇలాంటి ఫీట్ సాధిస్తానని ఎన్నడూ అనుకోలేదు. వాంఖడే లో ఆడటం నాకు ఎంతో ప్రత్యేకం. ముంబైలో ఇన్ని వికెట్లు తీస్తానని అస్సలు ఊహించలేదు. ఇక్కడ ఆడితే చాలని అనుకున్నా. కానీ ఏకంగా రేర్ ఫీట్ సాధించినందుకు ఆనందంగా ఉంది..’ అని అన్నాడు.
ఇక రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ తనను అభినందించడంపై స్పందిస్తూ.. ‘నా కెరీర్ లో మళ్లీ ఇన్ని వికెట్లు సాధిస్తానో లేదో నాకు తెలియదు. అలాంటి అవకాశం కూడా రాకపోవచ్చు. ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసి దిగ్గజాల సరసన నిలిచినందుకు ఆనందంగా ఉంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు సారథి విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ సిరాజ్ లు మా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి మరీ నన్ను అభినందించారు. అది నేనెప్పటికీ మరువలేను....
ద్రావిడ్ ఎంత గొప్ప ఆటగాడో మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి నన్ను మెచ్చుకోవడం జీవితాంతం గుర్తుంటుంది. ఇక టీమిండియా వంటి జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్న కోహ్లీ.. నన్ను అభినందించడమనేది కూడా చాలా పెద్ద విషయం. సిరాజ్ కూడా నన్ను మెచ్చుకున్నాడు. ఆపై రవిచంద్రన్ అశ్విన్.. నా ఇంటర్వ్యూ తీసుకోవడమే గాక తన జెర్సీని కూడా నాకు అందించాడు. మొత్తానికి టీమిండియా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని చాటారు. అది నన్ను ఎంతగానో కట్టిపడేసింది..’ అని అజాజ్ చెప్పాడు.
ఇక ముంబై మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘వాంఖడే ఆనర్స్ బోర్డులో నా పేరు ఎప్పుడూ ఉంటుంది. దానిని ఎప్పటికీ తుడిచేయలేరు. నేను మొదటి రోజు నాలుగు వికెట్లు పడగొట్టినప్పుడే అనుకున్నా. ఇంకో వికెట్ తీస్తే ఆనర్స్ బోర్డులో నా పేరుంటుందని. ఇక నేను తొమ్మిది వికెట్లు తీశాక కొంత టెన్షన్ మొదలైంది. నేను వేసిన చివరి ఓవర్లో రచిన్ రవీంద్ర అద్భుతమైన క్యాచ్ పట్టి నాకు పదో వికెట్ అందించాడు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది..’ అని అజాజ్ తెలిపాడు.