Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో మూడు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అతని ఆటతీరు, కెప్టెన్సీపై ధోనీ, కోహ్లీతో పోలుస్తూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో అరుదైన ఘనతను సాధించాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా ఘనత సాధించాడు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్‌రైడర్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన అయ్యర్.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను కూడా ఐపీఎల్ ఫైనల్ కు తీసుకెళ్లాడు.

నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజింగ్ చేస్తూ, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్ వంటి స్టార్ బౌలర్లకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 41 బంతుల్లో 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అయ్యర్ 8 సిక్స్‌లు, 5 ఫోర్లతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

నేహాల్ వధేరాతో కలిసి అయ్యర్ 80కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వధేరా 29 బంతుల్లో 48 పరుగులు చేశాడు, అందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రెండోసారి పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరింది.

ఈ ఘనతతో శ్రేయస్ అయ్యర్‌ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే, అయ్యర్ ను మాజీ కెప్టెన్లైన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు. ప్రసిద్ధ వ్యాఖ్యాత జతిన్ సప్రూ మాట్లాడుతూ, “మనకు ఇప్పుడు కొత్త కెప్టెన్ కూల్ వచ్చాడు. ఈ ఇన్నింగ్స్ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. శ్రేయస్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు కెప్టెన్‌గా వచ్చాడు. ధోనీకి ‘క్యాప్టెన్ కూల్’, విరాట్‌కు ‘ఛేజ్ మాస్టర్’ అనే బిరుదులు ఉన్నట్లే, శ్రేయస్ కూడా ఆ స్థాయిలో కనిపించాడు. అతనే ఇప్పుడు కొత్త క్యాప్టెన్ కూల్, ఛేజ్ మాస్టర్” అని పేర్కొన్నారు.

ఆ కామెంట్స్ సమయంలో హర్భజన్ సింగ్, ఆకాష్ చోప్రా కూడా అక్కడే ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై వారు కూడా ప్రశంసలు కురిపించారు. పంజాబ్ కింగ్స్ జట్టు జూన్ 3న జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ ఘనతతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తూ క్లిష్ట పరిస్థితిలోనూ మ్యాచ్‌ను గెలిపించగల నాయకుడిగా సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన నాక్ ఆడాడు. పంజాబ్ గెలిచిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోకుండా కూల్ గా ఉన్న శ్రేయాస్ తీరును కూడా పలువురు ప్రశంసిస్తున్నారు.