పాక్ క్రికెట్ బోర్డుకు భారత ప్రభుత్వమే దిక్కు.. వాళ్లు తలుచుకుంటే.. మనం మూసుకోవాల్సిందే: పీసీబీ చైర్మన్ రమీజ్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత ప్రభుత్వమే దిక్కు అని, భారత ప్రభుత్వం ఏ క్షణంలోనైనా మన బోర్డుకు నిధులు నిలిపేయాలని నిర్ణయించుకుంటే పీసీబీ కుప్పకూలిపోతుందని చైర్మన్ రమీజ్ రాజా అన్నారు. ఐసీసీకి భారత్ నుంచే 90శాతం నిధులు సమకూరుతాయని, ఐసీసీ నుంచి పీసీబీకి 50శాతం నిధులు అందుతున్నాయని చెప్పారు. అంటే పరోక్షంగా భారత్లోని వ్యాపార సంస్థలే పాకిస్తాన్ క్రికెట్ను నడుపుతున్నాయని వివరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీకి చేరే నిధులు ‘సున్నా’ అని తెలిపారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు india ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తలుచుకుంటే చాలు.. మన బోర్డు మూతపడిపోతుంది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. స్వయంగా pakistan cricket board చైర్మన్ రమీజ్ రాజా. ఇంటర్ ప్రావిన్షియల్ కోఆర్డినేషన్పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ఈ మాటలు అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు మొత్తంగా ICC మీదే ఆధారపడి ఉన్నదని తెలిపారు. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కేవలం ఐసీసీ నుంచే 50శాతం funds వస్తున్నాయని వివరించారు. ఐసీసీ ఫండింగ్ అంటే మరేమో కాదని, ఆ కౌన్సిల్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి బోర్డు మెంబర్స్కు నిధులను పంచుతుందని తెలిపారు. మరొక ముఖ్య విషయమేమంటే, ఐసీసీకే సుమారు 90 శాతం నిధులు ఒక్క భారత్ నుంచే వస్తుంటాయని చెప్పారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే భారత్లోని వ్యాపార సంస్థలే పాకిస్తాన్ క్రికెట్ను నడిపిస్తున్నాయని వివరించారు.
ఒకవేళ india ప్రధానమంత్రి narendra modi ఎప్పుడైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నిధులను నిలిపివేయాలని నిర్ణయించుకుంటే, మన క్రికెట్ బోర్డు collapse అవుతుంది అని స్పష్టం చేశారు. ఐసీసీకి పాకిస్తాన్ అందించే నిధులు శూన్యమనీ వెల్లడించారు. ఐసీసీ రాజకీయమైన ఒక మండలి అని, అది పాశ్చాత్య, ఆసియాలుగా విడిపోయి ఉన్నదని పేర్కొన్నారు. నిజానికి ఐసీసీ అనేది కేవలం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా పరిమితమైందని వివరించారు. ఈ బోర్డులో పీసీబీ తన గళం వినిపించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగైతేనే, కన్ఫామ్ అయిన క్రికెట్ సిరీస్లు రద్దు కాకుండా చూసుకోగలమని వివరించారు.
ఇదే సందర్భంలో ఆయన ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పారు. రద్దయిన న్యూజిలాండ్ టీమ్ సిరీస్ త్వరలోనే జరుగుతుందని సంకేతాలిచ్చారు. వచ్చే వారాల్లో న్యూజిలాండ్ టీమ్ పాకిస్తాన్ పర్యటనపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిపారు.
వచ్చే టీ20 వరల్డ్ కప్లో భారత జట్టును ఓడిస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఓ బలమైన ఇన్వెస్టర్ బ్లాంక్ చెక్ ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నాడని చెప్పడం గమనార్హం.