MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 లో ముంబయి ఇండియన్స్ (MI)ను  పంజాబ్ కింగ్స్ (PBKS) ఓడించి ఫైనల్ కు చేరుకుంది.

MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 లో ముంబయి ఇండియన్స్ (MI) - పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడ్డాయి. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ సూపర్ విక్టరీ కొట్టింది. ముంబై 20 ఓవర్లలో 203/6 పరుగులు చేసింది. పంజాబ్ టీమ్ మరో ఓవర్ మిగిలివుండగానే 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులతో విజయం సాధించింది. 

దీంతో ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లగా, పంజాబ్ టీమ్ ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరింది. ఇప్పుడు జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ లో పంజాబ్ తలపడనుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల సునామీ రేపారు. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై సూపర్ నాక్ ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులకే పెవిలియన్ కు చేరాడు.

మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో 38 పరుగుల ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. తిలక్ వర్మ కూడా మంచి నాక్ ఆడాడు. 44 పరుగుల తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో కూడా అదిరిపోయే నాక్ ఆడాడు. 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.

చివరలో నమన్ ధీర్ మెరుపులు మెరిపిస్తూ 37 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగలు చేసింది. పంజాబ్ ముందు 204 పరుగులు భారీ టార్గెట్ ను ఉంచింది. పంజాబ్ బౌలర్లలో ఓమర్జాయ్ 2 వికెట్లు తీసుకున్నాడు.

తగ్గేదే లే.. శ్రేయాస్ అయ్యర్ సూపర్ నాక్.. ఫైనల్ కు పంజాబ్

204 పరుగుల భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. 6 పరుగులకే ప్రభ్ సిమ్రాన్ సింగ్ వికెట్ ను కోల్పోయింది. ప్రియాంష్ ఆర్య కూడా పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయాడు. 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు.

అయితే, జోష్ ఇంగ్లీస్, శ్రేయాస్ అయ్యర్, నేహల్ వధేరాలు దూకుడుగా ఆడుతూ పంజాబ్ జట్టుకు విజయాన్ని అందించారు. జోస్ ఇంగ్లీస్ 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. నేహల్ వధేరా 48 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ నాక్ ఆడాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో పంజాబ్ కు విజయాన్ని అందించాడు. 87 పరుగుల తన అజేయ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. 

 

Scroll to load tweet…