Siraj opens Joharfa restaurant: మహ్మద్ సిరాజ్ తన మొదటి రెస్టారెంట్ 'జోహార్ఫా'ను హైదరాబాద్లో ప్రారంభించారు. ఆయనకు గుర్తింపునిచ్చిన నగరానికి కృతజ్ఞత చెల్లించే అంశంగా దీనిని పేర్కొన్నారు.
Siraj opens Joharfa restaurant: భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఫుడ్ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్తగా ఒక రెస్టారెంట్ ను ఓపెన్ చేశారు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 3 లో తన మొదటి రెస్టారెంట్ 'జోహార్ఫా'ను ప్రారంభించారు.
సిరాజ్ తన రెస్టారెంట్ లో మఘలాయ్, పర్షియన్, అరబ్, చైనా వంటకాల కలయికగా రూపొందించిన ప్రత్యేకమైన ఆహారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రెస్టారెంట్ తో హైదరాబాద్ ఫుడ్ సీన్లో సిరాజ్ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు.
హైదరాబాద్ నాకు గుర్తింపునిచ్చింది.. : సిరాజ్
హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్ ప్రారంభం వెనుక విషయాలను సిరాజ్ మీడియాతో పంచుకున్నారు. సిరాజ్ మాట్లాడుతూ.. “జోహార్ఫా నాకు చాలా ప్రత్యేకమైనది. హైదరాబాద్ నాకు గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు ఈ రెస్టారెంట్ ద్వారా నేను ఈ నగరానికి నా కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నాను. ఇది ప్రజలు కలసి భోజనం చేయడానికి, ఇంటివంటల రుచుల్ని ఆస్వాదించడానికి ఒక ప్రదేశం కావాలన్న ఆలోచనతో ప్రారంభించాను” అని అన్నారు.
జోహార్ఫా రెస్టారెంట్ అనుభవజ్ఞులైన చెఫ్లతో నడుస్తోంది. ప్రామాణిక వంటశైలి, తాజా పదార్థాలు, భోజన నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకతగా సిరాజ్ తెలిపారు. పర్సియన్, అరబ్ వంటకాలతో పాటు చైనీస్, హైదరాబాద్కు ప్రత్యేకమైన మఘలాయ్ స్పైస్ లతో కూడిన మెనూ ఆకర్షణగా ఉంటుందని తెలిపారు.
క్రీడా రంగం నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సిరాజ్
సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. క్రికెట్తోపాటు ఇతర రంగాల్లో అవకాశాలను అన్వేషిస్తున్న ఆటగాళ్లలో సిరాజ్ కూడా ఒకరయ్యారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సురేష్ రైనా, విరాట్ కోహ్లి వంటి ప్రముఖ ఆటగాళ్లు ఇప్పటికే ఫుడ్ రంగంలో రంగంలో అడుగుపెట్టారు. దేశంలోని పలు నగరాల్లో వారికి రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు సిరాజ్ కూడా ఆ జాబితాలో చేరారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జోహార్ఫా వీడియోలు
జోహార్ఫా రెస్టారెంట్ ఓపెనింగ్ అనంతరం ఇంటీరియర్ వీడియోలు, డిజైన్ డెక్కర్, భోజన వంటకాల ఫుటేజ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్గా మారాయి. గోల్డ్ థీమ్తో ముస్తాబైన ఇంటీరియర్స్, మెరిసిపోతున్న డెకరేట్ చేసిన డైనింగ్ స్పేస్ ఆకట్టుకుంటున్నాయి.
సిరాజ్ ప్రస్తుత క్రికెట్ ఫామ్ పై ప్రశ్నలు
ఇక క్రికెట్ విషయానికి వస్తే, మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్లో భారత జట్టులో భాగంగా ఉన్నారు. అయితే, ఇటీవల లీడ్స్ టెస్ట్లో ఆయన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు చేశారు. “ప్రస్తుతం సిరాజ్ స్థిరంగా రాణించలేకపోతున్నాడు. ఆ లోపం కారణంగా బుమ్రా ఒక్కడిపై భారం మోపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది” అని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు.
ప్రసిధ్ కృష్ణతో పోలిస్తే ప్రస్తుతం సిరాజ్ ఫామ్ గొప్పగా లేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. “ప్రస్తుతం పరిస్థితి చూస్తే బుమ్రాకు తోడు ప్రసిధ్ కృష్ణనే బాగా ఉన్నట్టు కనిపిస్తోంది” అని తెలిపారు.
