IND vs WI : వెస్టిండీస్తో చావో రేవో.. హోం గ్రౌండ్ లో రింకూ సింగ్ ఆడేనా?
IND vs WI : టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ చేరాలంటే వెస్టిండీస్పై భారత్ తప్పక గెలవాలి. తండ్రి మరణంతో రింకూ సింగ్ ఈ మ్యాచ్ ఆడతారా? లేదా అనే ప్రశ్నల మధ్య టీమిండియా తుది జట్టులో మార్పులపై ఉత్కంఠ నెలకొంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

IND vs WI : సెమీస్ చేరాలంటే గెలవాల్సిందే! వెస్టిండీస్తో తలపడనున్న భారత్
టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. సెమీఫైనల్లో బెర్తు ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా భారత క్రికెట్ జట్టు ఆదివారం (మార్చి 1న) వెస్టిండీస్తో తలపడనుంది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ హై-వోల్టేజ్ పోరుకు సిద్ధంగా ఉంది. సూపర్-8 దశలో ఇది భారత్కు చివరి మ్యాచ్ కాగా, ఇందులో విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, ఈ కీలక మ్యాచ్కు ముందు భారత శిబిరంలో విషాదం నెలకొంది.
రింకూ సింగ్ కుటుంబంలో విషాదం
భారత స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా గ్రేటర్ నోయిడాలోని ఒక ఆసుపత్రిలో స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. తండ్రి మరణ వార్త విన్న వెంటనే రింకూ సింగ్ జట్టును వీడి తన స్వగ్రామమైన అలీగఢ్కు వెళ్లారు. అక్కడ తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. వెస్టిండీస్తో కీలక మ్యాచ్కు ముందు రింకూ కుటుంబంలో జరిగిన ఈ ప్రమాదం టీమ్ ఇండియా ఆటగాళ్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
హోమ్ గ్రౌండ్లో రింకూ సింగ్ ఆడేది సందేహమే
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ రింకూ సింగ్కు రెండో హోమ్ గ్రౌండ్ లాంటిది. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడే రింకూను ఈ సీజన్ కోసం రూ. 13 కోట్లకు ఆ జట్టు అంటిపెట్టుకుంది. తన అభిమాన మైదానంలో టీమ్ ఇండియా తరపున మెరవాలని రింకూ ఆశించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రింకూ తిరిగి జట్టుతో చేరినప్పటికీ, ఆయన మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని మేనేజ్మెంట్ ఆయనను బరిలోకి దించకపోవచ్చని సమాచారం. గత మ్యాచ్లోనూ రింకూ స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం దక్కింది.
విన్నింగ్ కాంబినేషన్తోనే భారత్?
వెస్టిండీస్తో జరిగే ఈ చావో రేవో పోరులో భారత జట్టు పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. గత మ్యాచ్లో జింబాబ్వేపై విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న టీమ్ ఇండియా, అదే ప్లేయింగ్ ఎలెవన్ను కొనసాగించాలని భావిస్తోంది. గత మ్యాచ్లో రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ను తీసుకున్నారు. చెన్నైలో జరిగిన మ్యాచ్లో బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు బౌలర్లు కూడా రాణించడంతో, విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కోల్కతాలో ప్రాక్టీస్ సెషన్
శనివారం సాయంత్రం ఈడెన్ గార్డెన్స్లో భారత జట్టు తమ తొలి శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. పిచ్ కండిషన్స్, వెదర్ ను బట్టి చివరి నిమిషంలో ఏవైనా మార్పులు ఉంటే నిర్ణయిస్తారు. అయితే, విండీస్ వంటి బలమైన జట్టును ఎదుర్కోవాలంటే నిలకడైన ప్రదర్శన కావాలని కోచ్, కెప్టెన్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ భారీ స్కోరు సాధించడం జట్టుకు ఎంతో కీలకం.
వెస్టిండీస్తో పోరుకు భారత తుది జట్టు అంచనా
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

