Punjab kings vs Royal challengers Bengaluru: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. మరి ఇరు జట్ల రికార్డులు గమనిస్తే ఎవరు గెలుస్తారు? ఎవరిది పైచేయి అవుతుంది?

IPL 2025 Qualifier 1 RCB vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు ముల్లాన్‌పూర్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతకు నేరుగా ఫైనల్‌లో స్థానం లభిస్తుంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన బెంగళూరు ఈ క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది.

RCB vs PBKS: రెండు జట్లు బలంగా.. సూపర్ ఫామ్ లో ఉన్నాయి 

ఇద్దరు కొత్త కెప్టెన్లు రజత్ పాటిదార్ (RCB), శ్రేయస్ అయ్యర్ (PBKS తమ జట్లను ఐపీఎల్ 2025 ట్రోఫీ వైపు నడిపించే బాధ్యతతో ముందుకు వస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు టైటిల్ గెలవలేకపోవడంతో ఈ మ్యాచ్ వారికి ఎంతో కీలకమైనదిగా మారింది. రెండు బలమైన టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.

పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఐపీఎల్ హెడ్ టూ హెడ్ రికార్డులు

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్. మొత్తంగా ఐపీఎల్ లో పంజాబ్-బెంగళూరు జట్లు ఇప్పటివరకు 35సార్లు తలపడ్డాయి. వాటిలో 18సార్లు పంజాబ్ విజయం సాధించింది. 17సార్లు బెంగళూరు గెలిచింది. గెలుపుల విషయంలో స్వల్పంగా పంజాబ్ దే అధిక్యం అని చెప్పాలి. అయితే, చివరి ఐదు మ్యాచ్ లలో పంజాబ్ పై బెంగళూరు నాలుగు మ్యాచ్ లను గెలవడం గమనార్హం.

బెంగళూరుకు పంజాబ్‌పై అత్యధిక స్కోరు 241 పరుగులు కాగా, బెంగళూరుపై పంజాబ్ 232 పరుగుల గరిష్ఠ స్కోర్ ను సాధించింది. తక్కువ స్కోర్ విషయానికి వస్తే పంజాబ్ తో జరిగిన ఒక మ్యాచ్ లో బెంగళూరు 84 పరుగులకే ఆలౌట్ అయింది. అలాగే, పంజాబ్ కనిష్ఠ స్కోరు 88 పరుగులు.

పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 2025 సీజన్ ఫామ్ ఎలా ఉంది?

ఐపీఎల్ 2025 సీజన్‌లో రెండు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. చెరో మ్యాచ్ ను గెలుచుకున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా అతను “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్”గా ఎంపికయ్యాడు.

తర్వాత ముల్లాన్‌పూర్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌లో బెంగళూరు పంజాబ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులు చేసి మ్యాచ్‌కు హీరోగా నిలిచాడు.

RCB vs PBKS: ఎవరు ఫైనల్ కు చేరుకుంటారు? 

ఈ క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఈ జట్లకు కీలకం. క్వాలిఫయర్ 1 లో ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఇప్పటివరకు సాగిన ప్రయాణం గమనిస్తే ఇరుజట్లు సమపాళ్లలో బలంగా ఉన్నాయి. వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న ఈ జట్లు టైటిల్‌ఫైటుకు ఒక అడుగు దూరంలో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఫామ్, టీమ్స్ గమనిస్తే ఇరు జట్లకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీకి కొద్దిగా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని క్రికెట్ విశ్లేషలకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆర్సీబీ స్థిరంగా బ్యాటింగ్ చేయడం కలిసివచ్చే అంశం.  అయితే, ఈ హోరాహోరీలో ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందనేది అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. బెంగళూరు-పంజాబ్ జట్లకు బలమైన బ్యాటింట్ లైనప్ ఉండటంతో ఈ మ్యాచ్ లో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.