ఐపీఎల్ 2025లో మ‌రో ఆస‌క్తిక‌ర ఘ‌ట్టానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క్వాలిఫ‌య‌ర్‌2కి అర్హ‌త సాధించేందుకు గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

శుక్రవారం, మే 30న ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) మధ్య పోరు ఉత్కంఠ‌ను పెంచుతోంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధించి అక్కడ పంజాబ్ కింగ్స్ (PBKS)‌తో తలపడుతుంది. ఫైనల్‌లో చేరేందుకు ఇది కీలక దశ.

ఒక‌వేళ వ‌ర్షం కురిస్తే.?

ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. అంటే, వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ప్రత్యక్షంగా గ్రూప్ దశ పాయింట్ల ఆధారంగానే అర్హతను నిర్ణయిస్తారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ పట్టికలో మూడో స్థానంలో ఉన్నందున, వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే గుజరాత్ టైటాన్స్ నేరుగా క్వాలిఫయర్-2కి చేరుతుంది. ఇక ముంబై ఇండియన్స్ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది..

ముల్లాన్‌పూర్ వాతావరణం ఎలా ఉంది.?

వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారుగా 37 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉండే సూచనలు ఉన్నాయి. దీనివల్ల మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తిగా జరిగే అవకాశం ఉంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఫైన్‌లోకి దూసుకెళ్లిన బెంగ‌ళూరు

గురువారం ఇదే వేదికపై జరిగిన క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మొదట బౌలింగ్‌లో చక్కటి ప్రదర్శన చేసిన బెంగ‌ళూరు టీమ్ బ్యాటింగ్‌లోనూ రాణించింది. రజత్ పటిదార్ నాయకత్వంలోని ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించి దూసుకెళ్లింది.