సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, లక్నో సూపర్ జెెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాథి నిన్నటి మ్యాచ్ లో మైదానంలోనే కొట్టుకున్నంతపని చేసారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఐపిఎల్ మేనేజ్మెంట్ కీలక చర్యలు తీసుకుంది.
IPL 2025 LSG VS SRH : లక్నో సూపర్ జెయింట్స్ (LSG) స్పిన్నర్ దిగ్వేష్ రాథిని అతడి ఓవర్ సెలబ్రేషన్స్ చిక్కుల్లో పడేసాయి. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రత్యర్ధి ఆటగాళ్లను రెచ్చగొట్టేలా అతడు సెలబ్రేట్ చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. ఇలా నిన్న(సోమవారం) జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాగే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) అతి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.. అంతేకాదు ఓపెనర్ అభిషేక్ శర్మతో దురుసుగా ప్రవర్తించాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్ని ఐపిఎల్ మేనేజ్మెంట్ దిగ్వేష్ రాథిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంటే ఎల్ఎస్జీ ఆడే తర్వాతి మ్యాచ్ లో ఇతడు ఆడలేడన్నమాట.
లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం రాత్రి లక్నో, హైదరాబాద్ టీంలు తలపడ్డాయి. ఈ క్రమంలో చెలరేగి ఆడుతున్న సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మను దిగ్వేష్ ఔట్ చేసాడు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే అతడు 'నోట్బుక్' సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అభిషేక్ ను అవమానించేలా సైగల్ చేసాడు. దీంతో చిర్రెత్తిపోయిన హైదరాబాద్ బ్యాట్ మెన్ దిగ్వేష్ వద్దకు వెళ్లడంతో మైదానంలో వాతావరణ వేడెక్కింది. ఇద్దరు ఆటగాళ్లు అమీతెమీకి సిద్దమవగా అంపైర్లు వారిని నిలువరించారు.
ఎస్ఆర్హెచ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. దిగ్వేష్ బౌలింగ్ లో అభిషేక్ బిగ్ షాట్ కొట్టబోగా షార్దూల్ ఠాకూర్ క్యాచ్ పట్టాడు. అభిషేక్ పెవిలియన్కు వెళ్తుండగా దిగ్వేష్ అతని వైపు దురుసుగా సంజ్ఞలు చేశాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. మ్యాచ్ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నారు.
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్కు దిగ్వేష్ దూరం
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) దిగ్వేష్ సింగ్ రాథిపై కఠిన చర్యలు తీసుకుంది. దిగ్వేష్ కు 50% మ్యాచ్ ఫీజు జరిమానా, రెండు డిమెరిట్ పాయింట్లు, ఒక మ్యాచ్ నిషేధం విధించినట్లు బిసిసిఐ ప్రకటించింది.
దిగ్వేష్ రథీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పదేపదే దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ 21 ఏళ్ల యువ క్రికెటర్కు ఇప్పటికే రెండుసార్లు జరిమానా విధించారు, మూడు డిమెరిట్ పాయింట్లు ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యాను ఔట్ చేసిన తర్వాత అతను మొదటిసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించాడు. దీనికి అతనికి ఒక డిమెరిట్ పాయింట్, 25% మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు.
ముంబై ఇండియన్స్ బ్యాటర్ నమన్ దీర్ను ఔట్ చేసిన తర్వాత దిగ్వేష్ సింగ్ రాథి రెండోసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించాడు. దీనికి అతనికి రెండు డిమెరిట్ పాయింట్లు, 50% మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. మొత్తం ఐదు డిమెరిట్ పాయింట్లతో అతనికి ఒక మ్యాచ్ నిషేధం పడింది.
అభిషేక్ శర్మకు జరిమానా
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దిగ్వేష్ రాథితో వాగ్వాదానికి దిగినందుకు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మకు కూడా జరిమానా విధించారు. బిసిసిఐ ప్రకటన ప్రకారం ఎస్ఆర్హెచ్ ఓపెనర్కు 25% మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు.
“ఈ సీజన్లో ఆర్టికల్ 2.6 ప్రకారం ఇది అతని మొదటి లెవెల్ 1 నేరం, కాబట్టి అతనికి ఒక డిమెరిట్ పాయింట్ ఇవ్వబడింది. లెవెల్ 1 నేరాలకు మ్యాచ్ రిఫరీ నిర్ణయం ఫైనల్” అని బిసిసిఐ మీడియా ప్రకటనలో పేర్కొంది.
ఐపీఎల్ 2025 నుండి ఎల్ఎస్జి నిష్క్రమణ
సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 నుండి నిష్క్రమించింది.20 ఓవర్లలో 205/7 స్కోరు చేసిన ఎల్ఎస్జి తమ స్కోరును కాపాడుకోలేకపోయింది. ఎస్ఆర్హెచ్ 10 బంతులు మిగిలి ఉండగానే 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హెన్రిచ్ క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32), ఇషాన్ కిషన్ (35) కూడా రాణించారు.
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించింది. 12 మ్యాచ్ల్లో 5 విజయాలు, 7 ఓటములతో ఎల్ఎస్జి ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది.