లక్నో వేదికగా జరిగిన హైఓల్టెజ్ మ్యాచ్ లో విజయం సన్ రైజర్స్ నే వరించింది. దీంతో లక్నో ప్లేఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. కీలకమైన ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, దిగ్వేష్ మధ్య హీట్ హీట్ సంఘటన చోటుచేసుకుంది. 

ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలో హైవోల్టేజ్ మ్యాచ్‌ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG),సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన ఈ మ్యాచ్ లక్నోకు డూ ఆర్ డై లాంటింది... అలాంటి మ్యాచ్ లో ఎల్ఎస్జీ ఓడిపోయింది. దీంతో లక్నో ప్లేఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోరు చేసినా హైదరాబాద్ ను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో ఎల్ఎస్జి విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది హైదరాబాద్.

లక్నో టీంలో ఓపెనర్లు మిచెల్ మార్ష్ 65 పరుగులు, మార్క్రమ్ 61 పరుగులు, నికోలస్ పూరన్ 45 పరుగులతో రాణించారు. దీంతో లక్నో 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే 59 పరుగులు చేసాడు. ఇందులో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. తర్వాత ఇషాన్ కిషన్ 35 పరుగులు, క్లాసేన్ 47 పరుగులు, కమిడో మెండిస్ 32 పరుగులతో రాణించారు. దీంతో ఎస్ఆర్హెచ్ సునాయాసంగా గెలిచింది.

అభిషేక్ శర్మ-దిగ్వేశ్ ఘర్షణ :

లక్నో, హైదరాబాద్ మధ్య మ్యాచ్ లో ఓ సంఘటన క్రికెట్ అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఆటగాళ్ల భావోద్వేగాలు నియంత్రణ కోల్పోయి వివాదం రేగింది. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో లక్నో బౌలర్ దిగ్వేష్ రాథి సెలబ్రేషన్స్ వివాదానికి కారణమయ్యాయి.

అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 59 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ తో హైదరాబాద్ టీం మొదటి ఏడు ఓవర్లలోనే 98 పరుగులు చేసింది. అభిషేక్-ఇషాన్ కిషన్ జోడీ జట్టు విజయానికి బలమైన బాటలు వేసారు. ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ దిగ్వేశ్ రాథ అభిషేక్ శర్మను ఔట్ చేసి కీలక బ్రేక్ అందించాడు. ఆఫ్సైడ్ బౌండరీ దాటి షాట్ కొట్టేందుకు అభిషేక్ ప్రయత్నించగా శార్దూల్ ఠాకూర్ స్వీపర్ కవర్‌లో క్యాచ్ పట్టాడు. వెంటనే దిగ్వేశ్ తన సిగ్నేచర్ “నోట్‌బుక్ సెలబ్రేషన్” చేసి అభిషేక్‌కు చేతి ఊపుతో గుడ్‌బై చెప్పాడు.

ఈ సెలబ్రేషన్ అభిషేక్ శర్మకు నచ్చలేదు. పెవిలియన్ వెళుతున్న అభిషేక్ తిరిగి దిగ్వేశ్ వైపు నడవడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య స్వల్పంగా మాటల తూటాలు పేలాయి. పరిస్థితి అదుపు తప్పకముందే ఫీల్డ్ అంపైర్ మద్య ప్రవేశించి వారిని సముదాయించారు. అంపైర్ దిగ్వేశ్ రాథితో కొద్దిసేపు మాట్లాడాడు. అనంతరం కొత్త బ్యాట్స్‌మన్ హైన్రిచ్ క్లాసెన్ క్రీజులోకి వచ్చాడు.

మ్యాచ్ సందర్భంగా నికోలస్ పూరన్ రనౌట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌లో ఫ్రస్టేషన్‌తో తన ప్యాడ్స్‌పై కొట్టిన సంఘటన కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకోవడం ఐపిఎల్ అభిమానులకు మరింత ఉత్కంఠను కలిగించాయి.